పెంచి వసూలు చేసిన టారిఫ్లు తిరిగి చెల్లించండి!
posted on: Feb 21, 2026 10:23AM

ట్రంప్ కు అమెరికా సుప్రీం కోర్టు షాక్
అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను యూఎస్ సుప్రీం కోర్టు కొట్టేసింది. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్హౌస్కు కానీ లేదని కుండబద్దలు కొట్టింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని అమెరికా అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మరోవైపు ఇప్పటికే ట్రంప్.. భారత్పై 18 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. భారత్పై విధించిన 18 శాతం సుంకాలు కూడా అనధికారమేనని సుప్రీం పేర్కొంది.
అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా వ్యవహరించడం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం-1977కి విరుద్ధమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వెల్లడించారు. అయితే సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆరుగురు, అనుకూలంగా ముగ్గురు జడ్జిలు వేర్వేరుగా తమ తీర్పు ఇచ్చారు. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఇచ్చిందనీ, కార్యనిర్వాహక శాఖకు కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం వెల్లడించింది. జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఇలా సుప్రీం కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడం పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.






