పవన్‌తో బీజేపీ రాయబారం

posted on: Sep 17, 2016 12:42PM

 

ప్రత్యేక హోదా విషయమై ఎప్పుడైతే బీజేపీ చేయిచ్చిందో అప్పటి నుంచీ పవన్‌ నోటికి పనిచెప్పారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ సెటైర్లతో మొదలుపెట్టి, బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీని ఉతికి ఆరేశారు. పెద్దాయన మోదీ జోలికి పోకపోయినా, ఇంటాయన వెంకయ్యనాయుడుని మాత్రం ఏకిపారేశారు. ఇటు తిరుపతిలోనూ, అటు కాకినాడలోనూ పవన్‌ బీజేపీని ఒక స్థాయిలో చీల్చి చెండాడారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోతే తెలుగువారి ఆత్మగౌరవం మంటగలసినట్లే అన్నంత ప్రచారాన్ని తీసుకువచ్చారు.

 

మొదట్లో పవన్‌ విమర్శలకు బీజేపీ శ్రేణులు కూడా ప్రతివిమర్శలు చేశాయి. వెంకయ్యనాయుడుని విమర్శించినందుకు క్షమాపణలు చెప్పితీరాల్సిందే అంటూ పట్టుపట్టాయి. కెమెరా ముందు కనిపించే అవకాశం లేని నేతల సైతం పవన్‌ని విమర్శించేందుకు ముందుకు వచ్చారు. కానీ పవన్‌ గాండ్రింపుల ముందు వీరి సౌండ్‌ బైట్లు పెద్దగా వినిపించలేదు. అంతేకాదు! పవన్‌ విమర్శలతో తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి చేటు జరుగుతోంది అన్న సూచనలు కేంద్రానికి అందాయి. దాంతో కేంద్ర నష్టనివారణకు చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం.

 

చంద్రబాబు ఎలాగూ ప్యాకేజీ మీద ఆశలు వదిలేసుకుని, ఇచ్చిన నిధులతో తృప్తిపడిపోయారు కాబట్టి పవన్‌ని కూడా దారికి తెచ్చుకుంటే మంచిదన్న అభిప్రాయం బీజేపీలో వ్యక్తమవుతోంది. ఇందుకోసం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుని రంగంలోకి దింపినట్లు సమాచారం. నిజానికి పవన్‌ను బీజేపీకి దగ్గర చేసింది సోమ వీర్రాజే. కాబట్టి ఆయన ద్వారానే మళ్లీ చితికిపోయిన బంధానికి అతుకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. ఆ ప్రయత్నాలు ఎంతవరకూ సఫలం అవుతాయో కాలమే చెప్పాలి. ఆ రాయబారమే కనుక సఫలం అయితే పాచిపోయినా సరే, లడ్డూ లడ్డేయే అని తెలుగు ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం పవన్‌ చేస్తారేమో చూడాలి!

google-ad-img
    Related Sigment News
    • Loading...