కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.!

posted on: Jul 24, 2026 1:14PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలను, రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర పరిధిలోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేస్తూ జనవాసాలపై పడుతున్న గజరాజుల గుంపులను అదుపు చేసేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది.  చిత్తూరు జిల్లా పలమనేరు ఏనుగుల సంరక్షణ కేంద్రం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, 'అభిమన్యు  అనే రెండు కుంకీ ఏనుగులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు.

మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న   కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్   పూలమాలలు వేసి వెల్కమ్ చెప్పారు.  అలాగే ఏనుగులకు   ఇష్టమైన చెరుకు గెడలను, ఇతర ఆహార పదార్థాలను స్వయంగా అందజేశారు.  విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రైతుల పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న అడవి ఏనుగుల దాడులను నివారించడంలో ఈ కుంకీలు కీలక పాత్ర పోషిస్తాయన్న పవన్ కల్యాణ్  ప్రత్యేక వాహనంలో ఆ ఏనుగులను మన్యం జిల్లాకు పంపుతూ వీడ్కోలు పలికారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. 


ఈ ఏనుగులు  ముందుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడ నుంచి  అడవి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలకు వీటిని తీసుకెళ్తారు. స్థానిక అటవీ అధికారులు, ఏనుగుల సంరక్షణ బృందాలు రూపొందించిన  ప్రణాళిక ప్రకారం, ఇవి అడవి ఏనుగులను   దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి మళ్లిస్తాయి. 

గత కొంతకాలంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు మండలాల్లో ఏనుగుల గుంపులు తీవ్ర స్థాయిలో అలజడి సృష్టిస్తున్నాయి. ఎకరా కాలంలో వేసిన అరటి, వరి, చెరుకు పంటలను తొక్కి నాశనం చేస్తుండటంతో స్థానిక రైతాంగం కోలుకోలేని దెబ్బ తింటోంది. ఏ క్షణాన ఏనుగులు గ్రామాలపై పడతాయోనన్న రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో పలుమార్లు సైరన్లు, బాణసంచా కాల్చి ఏనుగులను బెదిరించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. కుంకీ ఏనుగులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.  

Mangalagiri Camp Office,  Parvathipuram Manyam,  Wild Elephants, AP Forest Department

google-ad-img
    Related Sigment News
    • Loading...