పవన్ యాక్టింగ్ చూతము రారండీ...
posted on: Mar 5, 2015 5:00PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయింది. పవర్ స్టార్ వెండితెర మీద మాత్రమే కాదు... జీవితంలో కూడా బాగా నటించగలడని ఈ పర్యటన చెప్పింది. పవన్ కళ్యాణ్ తన పర్యటన సందర్భంగా ఆస్కార్ తరహా యాక్టింగ్ ప్రదర్శించి అక్కడి అమాయక జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం విజయవంతంగా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ పర్యటనే ఒక గజిబిజి గందరగోళం నిండిన ప్లానింగ్ లేని పర్యటన. దీనికి తోడు వేలంవెర్రిగా పవన్ కళ్యాణ్ చుట్టూ మూగి గోలగోల చేసిన జనం... దానికి తోడు సుదీర్ఘ నటనానుభవం వున్న పవన్ కళ్యాణ్ గొప్ప నటన... ఇవన్నీ చూడటానికి రెండు కళ్ళుబదులు నాలుగు కళ్ళు వుంటే బాగుండనిపించేలా వున్నాయి.
పవన్ కళ్యాణ్ పర్యటించిన ప్రతి ఊరిలోనూ ఏదో హడావిడిగా రావడం, నిమిషానికి నాలుగుసార్లు తలని సవరించుకోవడం, ఏదో హడావిడిగా మాట్లాడేసి వెళ్ళిపోవడం. దీనికితోడు ఆయన మీద మీద పడిపోయే జనం. ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి తంటాలుపడేవాళ్ళు మరికాస్త గందరగోళం సృష్టించడం. ఇవి ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ తనకు కాస్త తిక్కుందని.. కానీ దానికో లెక్కుందనీ అంటూ వుంటారు. రాజధాని గ్రామాల్లో పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే తిక్క వరకు ఓకేగానీ, లెక్క విషయంలోనే ఏదో లెక్క తేడా వున్నట్టు అనిపిస్తోంది. పవన్ ప్రసంగంలో ఏదో ఆషామాషీగా మాట్లాడిన మాటలే తప్ప పకడ్బందీగా, అధ్యయనం చేసిన మాటలేవీ వినిపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో భూ సేకరణ చట్టాన్ని తెచ్చిందట.. దాని గురించి ఆయనకి తెలియదట. తెలియకపోతే జనాల దగ్గరకి వచ్చేటప్పుడు దాని గురించి తెలుసుకుని వచ్చి మాట్లాడాలి.... ఏదో గాల్లో దీపం పెట్టినట్టు తెలియదంటే సరిపోతుందా? ఆయన రైతుల ఇబ్బందులను చూడ్డానికి వచ్చాడట. రైతుల ఇబ్బందుల గురించి మంత్రులకు చెప్తాడట. దారినపోయే దానయ్య లాంటి పవన్ కళ్యాణ్కే రాజధాని గ్రామాల రైతుల ఇబ్బందుల గురించి అర్థమైపోయినప్పడు, ఎప్పుడూ ఆ గ్రామాల్లోనే పర్యటిస్తూ అక్కడి రైతులతో మమేకమై వున్న రైతులకు వారి ఇబ్బందులు తెలియవా? పవన్ ప్రసంగంలో లోపాలు వెతికి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు.
ఇక పవన్ గారి యాక్టింగ్ గురించి వస్తే, ఒక వేదిక మీద ఆయన కోసం ఓ కుర్చీ వేశారు. ఆయన దాని మీద కూర్చోకుండా కింద చతికిలబడ్డారు. ఓ మహిళ తెచ్చిన సంచిలోంచి వాటర్ బాటిల్ తీసి తాగారు. ఆమె తెచ్చిన బాక్స్లోంచి ఆహారం తీసుకుని తిన్నారు. పాపం మధ్యలో బాగా చెమట పోస్తే ఓ రైతు భుజం మీద వున్న టవల్ తీసుకుని ముఖాన్ని తుడుచుకున్నారు. జనాల్లో కలిసిపోయినట్టు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తన మనసును కలచివేస్తున్నట్టు కటింగులు బాగానే ఇచ్చారు. అయితే ఇలాంటి కటింగులు జనాన్ని తాత్కాలికంగా మురిసిపోయేలా చేస్తాయి. జనానికి అసలైన ఆనందాన్ని ఇచ్చేది ఆచరణ.. ప్రాక్టికల్గా వారికి జరిగే న్యాయం ఆనందాన్ని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లోనే వుంది. ఆ విషయాన్ని గ్రహించకుండా పవన్ చేసిన పర్యటన లేనిపోని గందరగోళాన్ని సృష్టించడం తప్ప సాధించిందేమీ లేదు.




.jpg)


.webp)


