Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో కుల రాజకీయాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు
posted on: May 25, 2026 9:27PM

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యర్థుల విమర్శలు, కుల రాజకీయాలు మరియు పార్టీలోని కొందరు నేతల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దేనికైనా ఒక హద్దు ఉంటుందని, భరించే కొద్దీ లోకువగా చూస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే తాట తీస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి పదవులు వచ్చిన తర్వాత జనసేనలోని కొందరు నాయకులు మెత్తబడిపోయారని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. పార్టీని, తనను కేవలం సొంత ఎదుగుదల కోసం వాడుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మనకు శత్రువులు బయట ఎక్కడో లేరని, సొంత పార్టీలోనే ఉన్నారంటూ పరోక్షంగా కొందరు నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారు మాత్రమే జనసేనలో కొనసాగాలని ఆయన తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో నడుస్తున్న కుల రాజకీయాలపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయం ఎంతో సాఫీగా, చూసి అసూయపడేలా సాగుతుందని గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం నిరంతరం కులాలను రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోందని మండిపడ్డారు. తాను ఎప్పుడూ కుల నాయకుడినని చెప్పుకోలేదని, సమాజంలో కుల విద్వేషాలను రేకెత్తించడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.
ఇదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తన భేటీపై వస్తున్న ఊహాగానాలపై పవన్ స్పందించారు. ఢిల్లీలో జరిగిన అంతర్గత చర్చలు బయటి వ్యక్తులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని తాను ఎందుకు కోరుకుంటానని, ఒకరి జైలు ప్రయాణం వల్ల జనసేనకు వచ్చే లాభమేమీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఏపీ అభివృద్ధి కోసమే తాను అమిత్ షాను కలిశానని వివరించారు.
తాను కేవలం తెలుగుదేశం పార్టీ కోసం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు మరియు ప్రజా సంక్షేమం కోసమే కూటమిలో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడతానని, బలహీనులపై ప్రతాపం చూపించనని అన్నారు. ఇకపై ఎవరైనా వ్యక్తిగత దూషణలకు దిగితే అదే స్థాయిలో సమాధానం ఉంటుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఎన్నికల విజయం తర్వాత కొంత స్తబ్దంగా ఉన్న జనసేన శ్రేణుల్లో ఈ భేటీ సరికొత్త జోష్ నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అటు ప్రతిపక్షాల విమర్శలకు, ఇటు పార్టీలో సొంత అజెండాతో దూసుకెళ్తున్న నేతలకు చెక్ పడినట్లయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.






