పట్టిసీమ నీళ్లు ఎప్పుడొస్తాయ్?... బాబుకి సీమ రైతుల ప్రశ్న

పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరివ్వాలనే చంద్రబాబు కల నెరవేరేలా కనిపించడం లేదు, ఖరీఫ్ నాటికి ఎలాగైనా సీమకు సాగు నీరివ్వాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు గండిపడింది, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు ఇస్తామని హామీ ఇచ్చిన బాబు, దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైనట్లే కనిపిస్తోంది, పట్టిసీమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది పక్కనబెడితే, రాయలసీమకు నీరివ్వడం మాత్రం సాధ్యం కాదంటున్నారు సీనియర్ ఇంజనీర్లు, దానికి శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టమే కారణమంటున్నారు.

రాయలసీమకు నీరివ్వాలంటే పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా రివర్ తరలించాల్సి ఉంటుంది, అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డి రెగ్యులేటరీ ద్వారా సీమకు వాటర్ రిలీజ్ చేయాలి, ఇది జరగాలంటే శ్రీశైలంలో మినిమం నీటిమట్టం ఉండాలంటున్నారు ఇంజనీర్లు, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కష్ణాకి తరలించినా, శ్రీశైలం దగ్గర దానికి కావాల్సినంత నీటిమట్టం లేకపోతే ఆ ప్రయత్నం వ్యర్ధమేనంటున్నారు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకు నీరు విడుదల చేయాలంటే, శ్రీశైంలో కనీసం 854 అడుగుల నీటిమట్టం ఉండాలని, ప్రస్తుత నీటిమట్టం 840 అడుగులు కూడా లేదని, దాంతో రాయలసీమలోని ఏ జిల్లాకి కూడా నీరు ఇవ్వలేమని చెబుతున్నారు, ప్రస్తుతమున్న నీటిమట్టంతో కనీసం అనంతపురం జిల్లాకి కూడా వాటర్ మూవ్ కాదని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లోని సీనియర్ అఫీషియల్స్ చెబుతున్నారు. కనీసం హంద్రీనీవాకి నీటిని తరలించాలన్న శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగులు దాటాలంటున్నారు.

ఆవిధంగా రాయలసీమకు నీరిస్తానన్న చంద్రబాబు హామీకి శ్రీశైలం రిజర్వాయర్ గండికొట్టింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించినా, శ్రీశైలం దగ్గర దానికి కావాల్సినంత నీటిమట్టం లేకపోవడంతో బాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయి, చివరికి మరోదారి లేక సీమకు పట్టిసీమ వాటర్ తరలింపును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.