పఠాన్‌కోట్‌కు వస్తున్న పాక్‌ బృందం

posted on: Mar 25, 2016 4:49PM

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద జరిగిన ఉగ్రదాడి గురించి పరిశోధించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఒక బృందం ఈ ఆదివారం భారత్‌కు చేరుకోనుంది. ఈ పరిశోధన బృందంలో, పాకిస్తాన్‌ నిఘా వర్గాలకు చెందిన అయిదుగురు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భారతీయ సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మన రక్షణ వ్యవస్థనే ఎగతాళి చేసిన ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌కు చెందినవారే అని ప్రాథమికంగా తేలింది. వీరికి జైష్‌-ఎ-మహమ్మద్‌ అనే సంస్థ కావల్సిన శిక్షణను అందించిందని బయటపడింది.

 

సదరు జైష్‌-ఎ-మహమ్మద్ అనే సంస్థ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా పనిచేసుకుంటోందనీ, దాని అధిపతి మౌలానా అజార్ పాకిస్తాన్‌లో రొమ్ము విరుచుకుని తిరుగుతున్నాడనీ... భారతీయ అధికారులు మండిపడుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌ జాతీయులే అని చెప్పేందుకు వారి సిమ్‌కార్డులు మొదల్కొని, బూట్ల వరకు పాకిస్తాన్‌ అధికారులకు అందించినా, ఇంతవరకూ వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మౌలానా అజార్‌ను అరెస్టు చేశామని ఓసారి, గృహనిర్బంధంలో ఉంచామని మరోసారి... అసలు అతని జోలికే పోలేదని ఇంకోసారి చెబుతూ వచ్చారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి రావడంతో, ఏవో కంటితుడుపు చర్యలకు సిద్ధపడ్డారు. అందుకు అనుగుణంగా ‘గుర్తుతెలియని వ్యక్తులు’ పఠాన్‌కోట్‌ మీద దాడి చేశారంటూ ఒక ఎఫ్.ఐ.ఆర్‌ని కూడా నమోదు చేశారు. ఆ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు, ఇదిగో ఇప్పుడు భరతదేశానికి వేంచేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...