Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం : సీఎం రేవంత్ రెడ్డి
posted on: Jun 5, 2026 5:06PM

గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది..కొత్తగా అప్పు పుట్టడం లేదు..
బీఆర్ఎస్ నేతలు నరనరాన అబద్ధాలు జీర్ణించుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భారీగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, ఆ కారణంగానే కొత్తగా అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా రెండో రోజు నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి, మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారని, అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ఆశలు నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అందులో దాదాపు రూ.1 లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకే వెచ్చించిందని తెలిపారు. కానీ అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉందని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేసి పూర్తి చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు.
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని విమర్శించారు. పంపులు, లిఫ్టుల పేరుతో వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు. భూసేకరణ పూర్తిచేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఎలా భావించారో అర్థం కావడం లేదన్నారు.
జిల్లాలోని ఏ ప్రాజెక్టును పరిశీలించినా అవసరమైన భూసేకరణ జరగలేదని, ప్రాజెక్టు నిర్మాణంలో ఇది ప్రధాన వైఫల్యమని చెప్పారు. ప్రాజెక్టులపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశారని గుర్తు చేశారు.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.84,503 కోట్ల అప్పులు చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో రూ.52,120 కోట్ల అప్పులు చెల్లించిందన్నారు. ఇదే కాలంలో కాంట్రాక్టర్లకు రూ.22 వేల కోట్లు చెల్లించగా, అందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టులకే వెచ్చించామని తెలిపారు.
ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించి మరో 4 వేల ఎకరాల భూసేకరణ అవసరముందని, రాబోయే రెండేళ్లలో అన్ని పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఓర్పుతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధమని సీఎం మండిపడ్డారు. అంచనా వ్యయంలో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయో తమకు అర్థం కావడం లేదన్నారు.
ఉన్నదంతా దోచుకుపోయి ఇప్పుడు తమపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అమాయకులు కాదని, వాస్తవాలు వారికి తెలుసని అన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకే తాను ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.
భూసేకరణకు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరిన సీఎం, ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తిచేసుకునే అవకాశం మళ్లీ రాకపోవచ్చని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రాజెక్టు పనుల పరిశీలన
నాగర్కర్నూల్ మండలం కుమ్మెరలోని పీఆర్ఎల్ఎస్ పంప్హౌస్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ-2, ప్యాకేజీ-3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ వాకాటి శ్రీహరితో కలిసి పనులను పరిశీలించిన సీఎం, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


.webp)
.webp)


