వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్.. లంకపై గెలిచినా నిరాశే

posted on: Feb 28, 2026 10:20PM

టీ20 ప్రపంచకప్   టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. శ్రీలకంపై శనివారం (ఫిబ్రవరి 8) జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో గెలిచినా సెమీస్ బెర్త్ కు నోచుకోకుండానే టోర్నీ నుంచి వైదొలగింది.  సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. ఆ సమీకరణాన్ని అందుకోవడంలో పాక్ విఫలమైంది. 

టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత  బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్  ఫర్హాన్ 60 బంతుల్లో  9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్  ఫకర్ జమాన్  42 బంతుల్లో  9 ఫోర్లు, 4 సిక్సర్లతో  84 పరుగులు చేశాడు. వీరిద్దరూ  ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి వికెట్‌కు ఏకంగా 176 పరుగులు జోడించారు.

213 పరుగులు విజయ లక్ష్యంతో శ్రీలంక బ్యాటింగ్ చేపట్టింది. పాకిస్థాన్ సెమీస్ కు చేరుకోవాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపు అరెస్టు చేయాలి. శ్రీలంకకు మంచి ఆరంభం లభించలేదు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆరంభంలో వికెట్లు తీయడంతో ఒక దశలో పాకిస్థాన్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా అనిపించింది. అయితే శ్రీలంక కెప్టెన్ షనక, పవన్ రత్నాయకేలు అద్భుత బ్యాటింగ్ తో పాక్ ఆశలను అడియాశలు చేయడమే కాకుండా శ్రీలంకను గెలుపు అంచుల వరకూ తీసుకువెళ్లారు.

స్కిప్పర్ షనక పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎనిమిది సిక్సర్లతో కేవలం 31 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే రత్నాయకే కూడా 38 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా శ్రీలంక విజయం సాధిస్తుందా అనిపించింది. చివరికి లంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...