చైనా, టర్కీలతో పాక్ రక్షణ ఒప్పందాలు?

posted on: Jun 5, 2026 9:22AM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించిన  ఆపరేషన్ సింధూర్  సృష్టించిన ప్రకంపనల నుంచి పాకిస్థాన్ ఇంకా తేరుకోలేదు. దాదాపు 88 గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ చారిత్రాత్మక ఆపరేషన్‌లో భారత సేనలు పాక్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి మెరుపు దాడులు జరిపాయి. ఈ భీకర దాడుల ధాటికి పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్  కుప్పకూలిపోయింది. తన వైమానిక రక్షణ వ్యవస్థలో ఉన్న ఘోరమైన లోపాలు బయటపడటంతో ఇస్లామాబాద్ తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయింది. ఈ దెబ్బతో మేల్కొన్న పాక్ సైన్యం, తన రక్షణ లోపాలను త్వరితగతిన సరిదిద్దుకునేందుకు ఇప్పుడు  ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

భారత సరిహద్దుల్లో కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవడానికి పాకిస్థాన్ ఇప్పుడు చైనా, టర్కీ దేశాల వైపు   చూస్తోంది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన సుదూర శ్రేణి క్షిపణులు, అలాగే టర్కీకి చెందిన అత్యంత ఆధునిక డ్రోన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి పావులు కదుపుతున్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం. పాక్  వైమానిక దళాన్ని  బలోపేతం చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్ ఈ కొనుగోళ్ల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు  పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చైనా నుంచి అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ   హెచ్‌క్యూ 9  కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం..  చైనా రూపొందించిన ఈ హెచ్‌క్యూ 9 వ్యవస్థ రష్యాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఎస్ 400  క్షిపణి వ్యవస్థతో సమానమైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ సుదూర శ్రేణి వ్యవస్థతో పాటు, రక్షణ అవసరాల కోసం హెచ్‌క్యూ 16, హెచ్‌క్యూ 17, అలాగే.. ఎల్ 17  మధ్యంతర శ్రేణి రక్షణ వ్యవస్థలను కూడా చైనా నుంచి పాకిస్థాన్ సమకూర్చుకోవాలని భావిస్తోంది. వీటిని భారత్‌తో ఉన్న తూర్పు సరిహద్దుల్లో మోహరించి.. భవిష్యత్తులో భారత వైమానిక దాడులను అడ్డుకోవాలని పాక్ భావిస్తోంది.

మరోవైపు మానవరహిత వైమానిక దాడులు, సరిహద్దు నిఘా కోసం టర్కీ రక్షణ భాగస్వామ్యాన్ని పాక్ కోరుకుంటోంది. టర్కీకి చెందిన సరికొత్త  కారాయెల్    మీడియం ఆల్టిట్యూడ్,  లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లను,  అలాగే లోయిటరింగ్ మ్యునిషన్లను దక్కించుకోవడానికి ఇస్లామాబాద్ ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ అత్యాధునిక టర్కీ డ్రోన్లను ఎల్ ఓసీవెంబడి నిరంతర నిఘా కోసం ఉపయోగించాలని పాక్ ఆర్మీ భావిస్తోంది. 

అయితే..  గతంలో పాక్ నమ్ముకున్న చైనా క్షిపణులు,  టర్కీకి చెందిన సోంగార్, వైఐహెచ్‌ఏ మోడల్ డ్రోన్లు.. భారత బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులు, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఆకాశ్, ఆకాశ్‌తీర్ రక్షణ వ్యవస్థల ధాటికి పూర్తిగా విఫలమయ్యాయి. కాగా  పాక్ ఎత్తుగడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా భారత సరిహద్దుల్లో అధునాతన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను, అదనపు క్షిపణి బలగాలను భారత్ ఇప్పటికే సిద్ధం చేసింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...