సౌదీలో మోహరించిన పాక్ సైనిక బలగాలు

posted on: May 19, 2026 6:26AM

 పశ్చిమాసియాలో మరోసారి  ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏ క్షణమైనా   యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు   వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇరాన్ జరిపిన దాడుల వల్ల గల్ఫ్ రీజియన్‌లో అభద్రతాభావం పెరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఒక సౌదీ పౌరుడు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును,  దాడులను తిప్పికొట్టేందుకు గల్ఫ్ దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే, సౌదీ అరేబియాకు రక్షణగా పాకిస్థాన్ తన సైన్యాన్ని,  అత్యాధునిక యుద్ధ విమానాలను భారీ స్థాయిలో రంగంలోకి దించింది.  సౌదీ అరేబియా రక్షణ అవసరాల కోసం పాకిస్థాన్ 8వేల నుంచి 13వేల  మంది వరకు సైనిక బలగాలను సౌదీకి  పంపింది. కేవలం భూతల సైనికులను మాత్రమే కాకుండా.. శత్రుదేశాల వైమానిక దాడులను అడ్డుకోవడానికి వీలుగా పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన  జేఎఫ్‌-17   ఫైటర్ జెట్లను, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లను,  అత్యాధునిక హెచ్‌క్యూ-9  ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా సౌదీలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్‌కు తరలించింది.  

 భవిష్యత్తులో అవసరమైతే గరిష్టంగా 80 వేలమంది వరకు పాక్ సైనికులను, అలాగే యుద్ధ నౌకలను కూడా సౌదీకి పంపేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతానికి ఈ సైనిక, వైమానిక దళాలు ప్రధానంగా రక్షణ, సలహా, శిక్షణా పాత్రలను పోషిస్తాయి.  వాస్తవానికి, అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి, కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడానికి ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలో సుమారు 21 గంటల పాటు సాగిన ఈ శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. 

చర్చలు విఫలమైన తరుణంలోనే, పాకిస్థాన్ తన వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చింది. ఇరాన్‌తో పాకిస్థాన్‌కు సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ మిత్రదేశాలతో ఉన్న వ్యూహాత్మక బంధానికే ఇస్లామాబాద్ మొగ్గు చూపింది.  గత ఏడాది సెప్టెంబర్ 17, 2025న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ఒక చారిత్రాత్మక 'స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్  కుదిరింది. నాటో ఆర్టికల్ 5 తరహాలోనే, ఈ ఒప్పందం ప్రకారం ఒకరిపై జరిగే దాడిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యల ప్రకారం.. ఈ ద్వైపాక్షిక ఒప్పందం వల్ల సౌదీ అరేబియా దేశం పాకిస్థాన్  అణు కవచం   పరిధిలోకి వస్తుంది. గతంలో పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా,  ఖతార్ దేశాలు సుమారు 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నాయి. దానికి ప్రతిఫలంగా, ఇప్పుడు సౌదీకి భద్రతా పరమైన ముప్పు పొంచి ఉన్న సమయంలో పాకిస్థాన్ తన అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో అండగా నిలిచింది. ఈ భారీ సైనిక మోహరింపు పశ్చిమాసియా రాజకీయాలలో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...