ఎమ్మెల్యే పాడి వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్
posted on: Jan 30, 2026 5:22PM

సిట్టింగ్ శాసనసభ్యుడు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిపై దురుద్దేశపూర్వకంగా, నిరాధారంగా మరియు హుందాతనానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై చేసిన ఆరోపణ లను సంఘం తీవ్రంగా ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
29 జనవరి 2026న స్థానిక పోలీస్ అధికారులు తమ చట్టబద్ధమైన విధులను నిర్వహిస్తున్న సమయంలో, ఎటువంటి ఆధారాలు లేకుండా, అనవసరంగా పోలీస్ కమిషనర్ పేరును మరియు ఆయన మతాన్ని ప్రస్తావిస్తూ, ఇతర మతా లకు చెందిన ప్రజలను తన మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఐపీఎస్ సంఘం స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు మరియు నిరాధా రమైనవని సంఘం పేర్కొంది.మర్యాద మరియు హుందాతనం దృష్ట్యా ఎమ్మెల్యే వాడిన అసలు పదాలను ఇక్కడ ప్రస్తావించడం లేదని సంఘం స్పష్టం చేసింది.
ప్రజలకు సేవలందిస్తున్న ఒక సీనియర్ అధికారిపై అతని మతాన్ని ఆధారంగా చేసుకుని చౌకబారు ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అభిప్రాయ పడింది. ఈ తరహా వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా, మొత్తం ఐపీఎస్ వ్యవస్థను, సివిల్ సర్వీసుల స్వాతంత్ర్యాన్ని మరియు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తన విధులను నిష్పక్షపాతంగా, రాజ్యాంగ పరంగా నిర్వహిస్తున్న సమయంలో, రాజకీయ వేదికలపై ఇలాంటి ఆరోపణలు చేయడం అత్యంత ఆందోళనకర పరిణామమని సంఘం పేర్కొంది. ఇది పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కూడా భావించాల్సి వస్తుందని సంఘం వ్యాఖ్యానించింది.
ఈ ఘటనను ఐపీఎస్ అధికారులు మరియు మొత్తం సివిల్ సర్వీసుల గౌరవంపై తీవ్రమైన దాడిగా తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం భావిస్తున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర గౌరవం, హద్దులు పాటించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సంఘం గుర్తుచేసింది.
ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తక్షణమే, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాకుండా, ఈ తీవ్రమైన దుష్ప్రవర్తనను సంబంధిత అధికారులు సుమోటోగా స్వీకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సంఘం కోరింది. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తరఫున కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
మరోవైపు పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను పోలీసులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వారి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు కౌశిక్ రెడ్డి. సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకొని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని ఆయన స్పష్టం చేశారు


.webp)



