Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కశ్మీరీ అని పక్కన పెట్టారా?.. ఎంపికపై వివాదం!
posted on: May 20, 2026 5:36PM

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా జరగనున్న ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శుభ్మన్ గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన టీమిండియాను అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించడంతో పాటు, ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ వంటి సరికొత్త యువ ముఖాలకు బీసీసీఐ చోటు కల్పించింది.
అయితే, దేశవాళీ క్రికెట్లో అసాధారణమైన ప్రదర్శనతో దుమ్మురేపిన జమ్మూ కశ్మీర్ స్టార్ పేసర్ ఆకిబ్ నబీని సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఎంపిక ప్రక్రియపై కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడమే కాకుండా, ఇది కాస్తా రాజకీయ వివాదంగా మారి తీవ్ర దుమారం రేపుతోంది.
ఆకిబ్ నబీ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే, అతడు ఎంతటి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడో స్పష్టమవుతుంది. 29 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లో జమ్మూ కశ్మీర్ జట్టు తరఫున కేవలం 10 మ్యాచ్లు ఆడి 17 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేశాడు. ఇందులో నమ్మశక్యం కాని రీతిలో కేవలం 12.56 సగటుతో మొత్తం 60 వికెట్లు పడగొట్టి దేశవాళీ క్రికెట్ను శాసించాడు.
ఈ క్రమంలోనే ఏకంగా 7 సార్లు ఐదు వికెట్ల హాల్ను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఆకిబ్ నబీ కేవలం 54 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. ఫలితంగా జమ్మూ కశ్మీర్ జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దాదాపు 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని ముద్దాడటంలో ఆకిబ్ నబీ అత్యంత కీలక పాత్ర పోషించాడు.
దేశవాళీ టోర్నీల్లో ఇంతగా రాణించినందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లు ఆడిన ఆకిబ్ ఒక వికెట్ సాధించాడు. కశ్మీర్లోని బారాముల్లాకు చెందిన ఈ పేసర్ను అతడి బౌలింగ్ శైలిని బట్టి అభిమానులు 'బారాముల్లా డేల్ స్టెయిన్' అని ప్రేమగా పిలుచుకుంటారు.
స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఆకిబ్ నబీ అద్భుతమైన ప్రతిభను, ప్రదర్శనను గతంలో ప్రశంసించారు. ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్నప్పటికీ, అఫ్గానిస్తాన్తో జరిగే టెస్టు జట్టులో అతడికి చోటు దక్కకపోవడంపై కశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) యువ నాయకుడు వహీద్ ఉర్ రెహమాన్ పరా సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ వహీద్ పరా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆకిబ్ నబీ కశ్మీర్కు చెందిన వ్యక్తి అనే చులకన భావనతోనే బీసీసీఐ అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దేశ ప్రధాని చేత శెభాష్ అనిపించుకున్న కశ్మీర్ బిడ్డ సంచలన ప్రదర్శన బీసీసీఐ కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, ఐసీసీ చైర్మన్ జై షా ఇద్దరూ కూడబలుక్కుని కొన్ని అదృశ్య శక్తులకు తలొగ్గి ఆకిబ్ నబీని భారత జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుపడ్డారని, వారి నిర్ణయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని దుయ్యబట్టారు.
60 వికెట్లు తీసినా జట్టులోకి తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మరోవైపు, ఆకిబ్ నబీ బౌలింగ్లో అంతర్జాతీయ స్థాయికి సరిపడా వేగం (పేస్) లేదనే కారణంతోనే సెలెక్టర్లు అతడిని పక్కనపెట్టారని, జట్టులో చోటు దక్కినా అరంగేట్రం కష్టమనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదేమైనా, ఒక ప్రతిభావంతుడైన క్రికెటర్ ఎంపిక వ్యవహారం ఇప్పుడు క్రీడా రంగాన్ని దాటి రాజకీయ రంగు పులుముకోవడం హాట్ టాపిక్గా మారింది.


.webp)
.webp)


