Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆపరేషన్ సిందూర్.. భారత దౌత్య, సైనిక పరాక్రమాల మేలు కలయిక!
posted on: May 7, 2026 12:39PM

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో భారత్ చేపట్టిన అత్యంత సాహసోపేతమైన చర్యగా ఆపరేషన్ సిందూర్ నిలిచింది. గత ఏడాది మేలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు కేవలం యుద్ధ తంత్రాన్నే కాకుండా, అంతర్జాతీయ దౌత్య సమీకరణాలనూ సైతం మలుపు తిప్పాయి. పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా వ్యూహరచన చేసింది. యుద్ధ రంగంలో సాంకేతికతను, దౌత్య రంగంలో చతురతను ప్రదర్శించి నిర్వహించిన ఆపరేషన్ సిందూర్.. దాయాది దేశాన్ని రక్షణ పరంగా ఆత్మరక్షణలో పడవేంది.
దీనికి మూలం పహల్గామ్ ప్రాంతంలో మొదలైంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనే ఉగ్ర ముఠా దాదాపు 26 మంది వివాహితులైన హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని ఘాతుకానికి పాల్పడింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడమే కాకుండా.. బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. దానిని ప్రతీకారంగా వివాహిత మహిళల మాంగల్యానికి ప్రతీక అయిన సింధూర్ ఈ ఆపరేషన్ పేరుగా ఎంచుకోవడం ద్వారా, ఆ వితంతువుల వేదనకు న్యాయం చేయాలనే భావోద్వేగ సందేశాన్ని కేంద్రం పంపింది. కేవలం గంటల వ్యవధిలోనే శత్రువులను కోలుకోలేని దెబ్బ తీయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వైమానిక దాడులకు ఆదేశాలిచ్చింది. సైనిక వ్యూహాల్లో భాగంగా భారత్ తన అత్యాధునిక ఎస్-400 క్షిపణి వ్యవస్థను రంగంలోకి దించింది. దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టడం ద్వారా అటు సైనిక శక్తిని, ఇటు సాంస్కృతిక ప్రతీకను కలిపి చూపింది. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల విమానాలను, నిఘా వ్యవస్థలను ఈ క్షిపణి వ్యవస్థ నేలమట్టం చేసింది. భారత వైమానిక దళం పాకిస్థాన్ లోని కీలక సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంతో.. ఆ దేశ రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. గతంలో జరిగిన బాలాకోట్ దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ కంటే ఇది ఎంతో విస్తృతమైన, ఆధునికమైనదిగా పరిశీలకులు విశ్లేషించారు. యుద్ధ రంగంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఆపరేషన్ సిందూర్ ఆసక్తికరమైన మలుపులను తెచ్చింది.
భారత్ దాడులకు తలొగ్గిన పాకిస్థాన్, నష్టనివారణ కోసం అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగ ప్రవేశం చేసి.. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు కృషి చేశారు. అయితే ఈ సహాయం వెనుక పెద్ద రాజకీయ బేరసారమే జరిగింది. ఇరాన్ సంక్షోభం నుంచి అమెరికా గౌరవప్రదంగా తప్పుకోవడానికి పాకిస్థాన్ సహకరించడం, దానికి ప్రతిగా భారత్ నుంచి పాకిస్థాన్ కు ఉపశమనం లభించేలా ట్రంప్ వ్యవహరించడం ఒక వ్యూహాత్మక ఒప్పందంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా వ్యక్తుల అహంకారం, అంతర్జాతీయ ప్రతిష్ఠలు కూడా దేశాల విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ ఉదంతం నిరూపించింది. తనను తాను గొప్ప శాంతిదూతగా ప్రదర్శించు కోవాలనుకున్న ట్రంప్ కోరికను పాకిస్థాన్ పాలకులు షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం ద్వారా ఆయన మద్దతును పొంది, తద్వారా తమ దేశాన్ని సైనిక విపత్తు నుంచి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది ఆధునిక కాలంలో నువ్వు నాకు సహాయం చేయి-నేను నీకు చేస్తాను' అనే తరహా దౌత్యానికి నిదర్శనంగా నిలిచింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై భిన్నమైన విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
యుద్ధాన్ని ఒక సినిమా క్లైమాక్స్ లాగా మహిమాన్వితం చేయడం ప్రమాదకరమని కొందరు అంటుంటే.. యుద్ధం అంటే కేవలం విజయమే కాదు, దాని వెనుక అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాలు, శరణార్థుల సమస్యలు ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించకూడదు. సింధూర్ వంటి భావోద్వేగపూరితమైన పేర్లను వాడటం ద్వారా ప్రజల సెంటిమెంట్లను రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సంక్లిష్టమైన దేశాల మధ్య సంబంధాలను అతి సరళీకృతం చేసి చూడటం వల్ల వాస్తవ పరిస్థితులు మరుగున పడే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ భవిష్యత్తులో భారత రక్షణ రంగానికి కొన్ని కీలక పాఠాలను నేర్పింది. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో అంతర్జాతీయ చట్టాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని గౌరవించడం కూడా అంతే అవసరమని అంటున్నారు. సైనిక సాంకేతికతలో ముందంజలో ఉండటంతో పాటు, దౌత్యపరమైన మేధస్సును ప్రదర్శించడం ద్వారా మాత్రమే దేశ ప్రయోజనాలను కాపాడుకోగలమని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. కేవలం ఆయుధ బలంతోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మిత్రదేశాలను సమన్వయం చేసుకోవడం కూడా విజయానికి కీలకమని అర్థమవుతోంది.
ఆపరేషన్ సింధూర్' అనేది భారత చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ఇది దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాట పటిమను చాటింది. అయితే యుద్ధం అనేది ఎప్పుడూ చివరి మార్గంగానే ఉండాలని, శాంతిని నెలకొల్పడమే ప్రజాస్వామ్య దేశాల ప్రాథమిక లక్ష్యం కావాలని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. రాబోయే రోజుల్లో భారత్ తన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువులకు హెచ్చరికగా నిలిచిన ఈ ఆపరేషన్, భవిష్యత్ వ్యూహరచనలో రక్షణ శాఖకు ఒక దిక్సూచిలా పనిచేయనుంది.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి


.webp)



