కాంగ్రెస్ లక్ష్యం.. .జెన్ జీ భాగస్వామ్యంతో ముందుకెడతాం.. టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత

posted on: May 2, 2026 2:50PM

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు.

కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.

రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. 

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...