మైత్రీవనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం

posted on: May 28, 2026 5:28PM

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి   నందమూరి తారక రామారావు  103వజయంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత  ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో  అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  గురువారం (మే 28) ఆవిష్కరించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలుపుకున్నారు. ఈ అద్భుత  విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ శిల్పి డి. రజ్ కుమార్ ఉడయార్ దాదాపు 2 నెలల పాటు   శ్రమించి  కళాత్మకంగా రూపొందించారు.   23 అడుగుల భారీ   కాంస్య విగ్రహం మైత్రీవనం కూడలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో, కమ్మ కార్పొరేషన్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.   ఈ విగ్రహావిష్కరణ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి,   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం మైత్రీవనం పరిసరాల్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. 

సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్, యూసఫ్‌గూడ మార్గాల్లో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించారు.  రాజకీయంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి చూపిన ఈ చొరవ అభినందనీయమన్న ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...