Top Stories

భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

  ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్  427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం  ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ (161) చెలరేగిపోయాడు. పంత్‌ (65), జడేజా (69*), కేఎల్‌ రాహుల్‌ (55) అర్ధశతకాలు బాదేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌, బషీర్‌ చెరో 2, రూట్‌, బ్రైడన్‌ తలో వికెట్‌ తీశారు.  అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా  587 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 407 రన్స్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంకా ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, భారత బౌలర్లు రాణిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచే ఛాన్స్ ఉంది.
భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం Publish Date: Jul 5, 2025 9:58PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్య క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు.  ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు  స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ... స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.   
క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ Publish Date: Jul 5, 2025 9:34PM

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

  అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు  ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరించిన మేరకు అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి  మండలం, రాయవరం గ్రామం, కావలిపల్లె అటవీ ప్రాంతంలో   అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని  అన్నమయ్య జిల్లా  జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుకు  పక్కా సమాచారం వచ్చింది . ఎస్పీ ఆదేశాల మేరకు, రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్. కృష్ణమోహన్  ఆధ్వర్యంలో, రాయచోటి రూరల్ సీఐ ఎన్.వరప్రసాద్, టి.సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది మరియు టి.సుండుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి   కావలిపల్లె అటవీ ప్రాంతంలో కాపుకాశారన్నారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న    ఆండీ గోవిందన్ ను  శనివారం ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.  *మరికొందరికోసం గాలింపు  అరెస్ట్ చేసిన ఆండీ గోవిందన్ విచారణలో  తమిళనాడు రాష్ట్రంలోని మరి కొందరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు తప్పించుకుపోయినట్లు తెలిసిందనని అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.వారికోసం  గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అటవీ సంపదను, ముఖ్యంగా ఎర్రచందనాన్ని రక్షించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.  
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్  అరెస్టు Publish Date: Jul 5, 2025 9:17PM

గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది ముఠా అరెస్టు

  అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో  రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బీ.వి.రమణ మాట్లాడుతూ గుప్తనిధుల కోసం వినాయకుడి విగ్రహం పగలు గొట్టిన ఘటనపై  పెనగలూరు పోలీస్ స్టేషన్  లో కేసు నమోదు అయ్యింద న్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే  సూచనలతో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతనెల 24  తేది తెల్లవారుజామున ఓబిలి స్కూలు ఆవరణలో దొంగతనం జరిగిన వినాయక విగ్రహం కేసులో వచ్చిన నమ్మకమైన సమాచారం అందిందన్నారు.  ఈ మేరకు, పెనగలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి మరియు సిబ్బంది పెనగలూరు  పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని విచారించారించారని తెలిపారు .వారు గత నెలలో ఓబిలి స్కూలు ఆవరణలో వినాయక విగ్రహ దొంగతనం గురించి తెలుపడం జరిగిందన్నారు. నందలూరు మండలం మదనగోపాలపురం కు చెందిన చుక్కా రవి అను వ్యక్తి గుప్త నిధుల కోసం చిట్వేలి కి చెందిన కొంత మంది కనిశెట్టి వెంకటసుబ్బయ్య, చిట్వేలి సుబ్బరాయుడు, ఆర్కాటు భాస్కర్  మరియు ఈటిమార్పురం నకు చెందిన డొంకా చంద్ర, బైర్రాజు సుధాకర్ రాజు లతో మాట్లాడుకొని గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో చుక్క రవి వియ్యంకుడు అయిన మనుబోలు కు చెందిన సురేష్ ద్వారా నెల్లూరు లో రాపూరు లక్ష్మమ్మ @ రాపూరు లక్ష్మి, మునుసామి వేలురెడ్డి @పూజారి, గోకిల రమేష్ @ కోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి మరియు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం వారిని మాట్లాడుకొన్నారని తెలిపారు.  అదేవిధంగా గుప్త నిధులు పైన ఆసక్తి ఉన్న పెనగలూరు కు చెందిన దాసరి వెంకట నరసమ్మ ,సుధాకర్ రాజు, చంద్ర వారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సుకదేబ్ రైతో, కలక్వాడ్ శ్యాం లతో పాటుగా అందరూ కలిసి గత నెల 23 తేది రాత్రి  ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరికున్నారని, వేకువ జామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఒదేటివారిపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఒక ట్రాక్టర్ లో వేసి  అక్కడ నుండి ఈటిమార్పురం చెరువు దగ్గరకు వెళ్లి, అక్కడ విగ్రహాన్ని దింపి, గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెట తో విరగకొట్టగా,  విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో  విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంట లో పడి వేశారన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వాహనాలు ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిల్ లు, ఒక సమ్మెట లను, వస్తువులను సీజ్ చేయడం అయినదని. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను గుర్తించడం అయినదని తెలిపారు. ఈ  కేసులో ప్రతిభ  కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శవి.విద్యాసాగర్ నాయుడు  అభినందించారు  
గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది  ముఠా అరెస్టు Publish Date: Jul 5, 2025 9:06PM

ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు

  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు. ఎయిమ్స్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడినవారిని ఆరు నెలల నుంచి ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.25వేలు జరిమానా కూడా విధించనట్లు తెలిపారు.   ఆ విద్యార్థులను వసతి గృహం నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు చెప్పారు. సస్పెన్షన్ కాలం పూర్తి అయిన తర్వాత కూడా వారు హాస్టల్ లో ఉండే అవకాశం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ పై ఇతరత్రా ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు.  
ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు Publish Date: Jul 5, 2025 8:55PM

విశాఖలో కోకైన్ కలకలం

  విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు థామస్ జియోన్ అనే ఆఫ్రికన్ దేశస్థుడు ఉన్నారు. చేకూరి అక్షయ్ ఏలియాస్ గున్న అనే వ్యక్తితో కలిసి థామస్ జియోన్ ను పోలీసులు విచారించారు వీరి వద్ద 25 గ్రాముల  కోకైన్ లభించింది.  దీని విలువ మార్కెట్లో 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా ఈ మాదక ద్రవ్యాన్ని  ఢిల్లీ నుంచి ఈ ఆఫ్రికన్ దేశస్థుడు తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది అయితే ఏ రకంగా భారత్ లోకి ఇది  వచ్చిందన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
విశాఖలో  కోకైన్ కలకలం Publish Date: Jul 5, 2025 7:35PM

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది : మంత్రి కొల్లు

  అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంద, అరాచకాలు, విధ్వంసాలు, కక్షసాధింపులతో ప్రజలను పీడించుకుతిన్నారు.  గుంటూరు జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున దాడులు చేయించి, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనివల్ల అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.  గతంలో టీడీపీ నాయకులపైన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నామీద, మా నాయకుడు చంద్రబాబునాయుడుని కూడా కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా?"  పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది వైసీపీయేనని, జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో గ్రామాల్లో కత్తులు తిప్పి అరాచకాలు చేసింది వైసీపీ నాయకులే. నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, గ్రామాల్లో వ్యక్తిగత దాడులకు దిగి అక్రమ కేసులు పెట్టాడని, బాబూరావుపై దాడి చేస్తే దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలి వెళ్లిపోయిన వారు, ఇప్పుడు మళ్లీ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత కక్షలకు పార్టీ రంగులు పులుముతున్నారు.  విజయవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టింది వైసీపీ ప్రభుత్వమే. దళిత సీఐ ఆనందరావును బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి చెప్పిన పనులు చేయలేదని గుర్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే పేదవాడైన అమర్‌నాథ్ ‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది వైసీపీ ప్రభుత్వమే. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి దాదాపు 80 మంది తెలుగుదేశం నాయకులను పెట్టనపెట్టుకుంది వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వమే.  జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక దళిత బిడ్డపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదని, దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగించారని, పోలీస్ స్టేషన్లలో కేకులు కట్ చేయించారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ‌ను హింసించి, వేధించి అతని ప్రాణాలు పోవడానికి కారణం వైసీపీయే. ఇసుక దందాను ప్రశ్నిస్తే దాడులు చేసి శిరోముండనం చేసింది కూడా వైసీపీనే కదా. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిపింది వైసీపీయేనని, పులివెందులలో అత్యాచారం చేసి హత్య చేస్తే, పరామర్శకు అనిత  వెళ్తే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా?. అలాగే తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయించి, దాడులు చేసిన వారికి ప్రమోషన్లు ఇప్పించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. కక్షపూరితమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి... తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎవరైతే దాడులు చేశారో వారికి ప్రమోషన్లు ఇచ్చి క్రిమనల్స్ ను ప్రోత్సహించింది వైసీపీయే. బూతులు మాట్లాడిన వారికి రక్షణ కల్పించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఒక జీవో తెచ్చింది కూడా వైసీపీయే. బియ్యం కొట్టేసినవాడు మాట్లాడుతున్నాడు.. దొంగపట్టాలు ఇచ్చినోడు మాట్లాడుతున్నాడు.. ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి దిగజారుతారా.. సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడుతారా?. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులను వేధించారని, అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు, కథనాలు, ప్రెస్‌ మీట్లు పెట్టించారు.  దోపిడీ దొంగలు వచ్చి ప్రెస్ ‌మీట్లు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. గతంలో పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, దాన్ని మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొంటూ, పిల్ల సైకోలు చేసిన తప్పులు తప్పించడం కోసం తప్పుడు ప్రెస్ ‌మీట్లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, అధికారులను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, వికలాంగులకు రూ.6000, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10,000, పూర్తిగా బెడ్ మీద ఉన్నవారికి రూ. 15000 ఇస్తున్నాం. దాదాపు 2 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చామని, గతంలో 42 లక్షల మందికి ఇస్తే, ఈరోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చాం. రోడ్ల గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేశామని, గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని తెలిపారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత ఇవ్వనున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం. మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే.. చూసి తట్టుకోలేక.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బురదజల్లే కార్యక్రమాలకు కొంతమంది పేటిఎం బ్యాచ్‌లను పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నాం. త్వరంలో మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం.. ఫ్రస్టేషన్‌లో రోజుకో మాట మాట్లాడుతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ రాజీనామా, సింగయ్యకు సంబంధించిన వీడియోలు వంటి విషయాలను కూడా వైసీపీ రాజకీయం చేస్తోంది. దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే.. దొర అయిపోతారా? అక్రమంగా ఇళ్ల పట్టాలు సృష్టించి ఎన్నికల్లో కొడుకును అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులను మీ పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహిస్తారా?. తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు.
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది : మంత్రి కొల్లు Publish Date: Jul 5, 2025 7:27PM

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

  సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, ఆర్ధిక శాఖ, సీసీఎల్ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పలనాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది.  రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియచేసింది.  రాజధాని పనులకు కృష్ణా నది నుంచే ఇసుక   రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణానది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు  జరుగుతున్న రీత్యా రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి  అవసరం అయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. రెండేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఇసుక డీసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్ల మేర వ్యయం కానున్నట్టు అథారిటీ సమావేశంలో అధికారులు తెలిపారు.  రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు 2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్  ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్  ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడెమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ అమోదం ఇచ్చింది.  అలాగే ఆదాయపు పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 2 ఎకరాలను, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలను కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40  ఎకరాలను రద్దు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో E-15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చేవారి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకూ మంచి పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు.  అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజధానిలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ Publish Date: Jul 5, 2025 7:12PM

రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ

  రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై  అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మధ్యమాలలో గ్రూప్ అడ్మిన్ లు ప్రతి సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని, మరియు  ఒక వేళ ఆయా గ్రూపుల్లో తప్పుడు సమాచారం వస్తే గ్రూప్అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయచోటి ఘటనపై  ఈ నెల 3వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేశామని, ఈ విషయం గురించి కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నారన్నారు. కనుక ఎటువంటి విషయాలు ఉన్నా అధికారికంగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు తెలియజేస్తారని,ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమాజంలో ముఖ్యంగా మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు.  ఏదైనా విషయానికి సంబంధించి పోలీసు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి న్నారు .తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై, సృష్టిస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు .వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జాతీయ భద్రతకు కు సంబందించిన విషయాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తీవ్రమైన నేరం గా పరిగనించబడుతుందన్నారు. మరియు చట్ట పరమైన పర్యావసనాలు కఠినంగా ఉంటాయన్నారు. కావున ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని ప్రమాణీకతను తనిఖీ  చేసుకోవడం చాలా ఎస్పీ సూచించారు.
రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ Publish Date: Jul 5, 2025 7:02PM

పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్‌‌లో  హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు. అయితే అనేక మంది వైసీపీ నేతలతో కొడాలి నాని పోలీస్‌స్టేషన్‌కు రావడం వివాదస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.  గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆయన గుడివాడ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయంలో నాని పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు రాచమర్యాదలు చేసేవారు. అప్పుడు అధికార ధీమాతో పోలీసులను బెదిరించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఓడలు, బండ్లు  అవుతాయి బండ్లు  ఓడలు అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు
పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని Publish Date: Jul 5, 2025 6:47PM

సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు

సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు కుప్పకూలింది. ఈ షెడ్డను  ఈ నెల తొమ్మిదో తేదీన గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఏర్పాటుచేశారు.  అదృష్టవశాత్తు షెడ్డు కూలిన  సమయంలో  భక్తులు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలినట్లు  తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు క్రింద ఎవరూ లేకపోవడంతో సరిపోయింది.  ఈ ఏడాది  ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందన యాత్ర సందర్భంగా మెట్ల మార్గంలో  క్యూ లైన్ గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గిరిప్రదర్శన సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇదే సంఘటన 9వ తేదీన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే సమయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధను ఇప్పటికైనా వీడాలని భక్తులు కోరుతున్నారు.  
సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు Publish Date: Jul 5, 2025 5:33PM

ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

  ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది. 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు అమలు చేసిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్‌ బేబీ కిట్లు' పేరుతో మళ్లీ మొదలు పెడతోంది.  ఈ కిట్‌లో దోమతెరతో ఉన్న వాటర్‌ ప్రూఫ్ షీటు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ, బట్టలు, తువ్వాలు, పరుపు, నాప్కిన్లు లాంటి 11 వస్తువులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రెండేళ్ల పాటు DMHOలు, DCHSలు, GGHలకు 'రేట్ కాంట్రాక్ట్' పద్ధతిలో కిట్లు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ కిట్లను పంపిణీ చేసే బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే 11 రకాల వస్తువులతో కలిపి.. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1410గా ఉంటుందని చెబుతున్నారు
ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు Publish Date: Jul 5, 2025 5:23PM

నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొన్నాది.  ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 14 వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరమ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదర్కొంటున్నారు.
నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ Publish Date: Jul 5, 2025 4:47PM

ఎరువుల కోసం రైతుల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు

తెలంగాణలో రైతాంగం అవస్థలు వ్యవసాయ అధికారులకు పట్టడం లేదు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ముందు చూపు కొరవడటంతో అన్నదాతలు అవస్థలు పడున్నారు.  ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అదును దాటుతున్నా.. సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైన అధికారుల తీరును దుయ్యబడుతున్నారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపెల్లి లోని రైతులు గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూలైన్ లో వదిలేసి పక్కకు వెళ్లి కూర్చుంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైనా యూరియా కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. దీంతో రైతాంగం. యూరియా కోసం   సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్‌లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదు. ఆ అరకొర సరఫరా వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా ఉంది.
ఎరువుల కోసం రైతుల తిప్పలు..  అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు Publish Date: Jul 5, 2025 4:39PM

బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు

  మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందల సంవత్సరాల అనావాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గోన్నారు. దీంతో అధికారులు  మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు
బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు Publish Date: Jul 5, 2025 4:02PM

కవిత కారు దిగిపోవడం ఖాయమేనా?

కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన కవిత.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కూడా. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలలో తొలి అడుగులు వేసినా.. ఆ తరువాత ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ, బోనాల పండుగలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. లోక్ సభ సభ్యురాలిగా తన ప్రతిభనూ చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  అటువంటి కల్వకుంట్ల కవిత ఇటీవల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కవితను బీఆర్ఎస్ కే కాకుండా.. కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. దీంతో కవిత పొలిటికల్ జర్నీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తన దేవుడంటూనే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా కవితను దూరంపెడుతున్నారు. ఇందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న తరుణంలో తండ్రిని కలవడానికి వచ్చిన కవితవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. చిన్న సైగతో ఆమె తన సమీపానికి కూడా రాకుండా నిలువరించారు. ఇక తాజాగా కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా సొంత కుమార్తె అయి ఉండి కూడా ఎవరో పరాయి వ్యక్తిలా, అతిథిలా కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ మించి ఇటీవల కవిత ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కారు దిగిపోవడానికే నిర్ణయించుకున్నారని తేటతెల్లం అయ్యింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆమె ఎంచుకున్న ఛానెల్.. అలాగే ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయంగా బీఆర్ఎస్ తో కలిసి నడిచే పరిస్థితి ఎంత మాత్రం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. భవిష్యత్ లో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తన సోదరుడు కేటీఆర్ తో తనకు విభేదాలున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిపైనే విమర్శలను గురిపెట్టి వదిలారు. తన నియోజకవర్గ అభివృద్ధికి స్వయంగా తాను కోరినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.  ఇక బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిర చేస్తున్న.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కవిత పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు.  వీటన్నిటినీ బట్టి చూస్తుంటే కవిత కారు దిగి సొంత దారి చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కవిత కారు దిగిపోవడం ఖాయమేనా? Publish Date: Jul 5, 2025 3:38PM

రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్

  రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.  72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్‌ అయ్యి చర్చకు రండి ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్ట్రమన్నారు. బేసిన్‌కు తేడా తెలియని రేవంత్..కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్ల వేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్‌. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్‌ఎస్‌. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో చర్చకు సిద్ధమని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు  Free electricity ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే చెందుంతన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటుని కేటీఆర్ అన్నారు.
రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్ Publish Date: Jul 5, 2025 3:26PM

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే?

  గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ క్రమంలో వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ ని చాలా మంది వాడుతుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ పైనే గుడ్డిగా ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే? Publish Date: Jul 5, 2025 2:47PM

విజేతగా నిలవాలని అనుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!!

  మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు  వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు. ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు. నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే!  బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.                                         *నిశ్శబ్ద.
విజేతగా నిలవాలని అనుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!! Publish Date: Jul 5, 2025 2:41PM

రేవంత్ సర్కార్ కు ఖర్గే కితాబు!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఒక విధంగా ఉరమని ఉరుముల రాష్ట్రంలో కాలుపెట్టిన ఖర్గే, ఆయన వెంట వచ్చిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చిన పనితో పాటుగా పక్కపనులను చక్కపెట్టుకు వెళ్ళారని, పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.  సరే.. పక్కపనుల సంగతి కాసేపు పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే..  మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా సామాజిక న్యాయ సదస్సు పేరిట తెలంగాణ కాంగ్రెస్ కమిటీ  శుక్రవారం (జులై 4) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రనికి వచ్చారు.అయితే సదస్సు సదస్సులా కాకుండా..  బహిరంగ సభలా జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలప్రదర్శన సభలా జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  విశ్లేషకులు పేర్కొనడమే కాదు.. పార్టీ నాయకులు అదే చెప్పుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగా కూడా  ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సెంట్రిక్ గానే జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో పెరిగిన దురాన్ని తగ్గించుకునే ప్రయత్నంగానూ.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి,తన కుర్చీని సుస్థిరం చేసుకునే ప్రయత్నంగా  ఎల్బీస్టేడియం సభను పేర్కొనవచ్చని పరిశీలకులతో పాటుగా, పార్టీ నాయకులు కూడా పేర్కొంటున్నారు.  అందుకే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అదనంగా ఏడవ గ్యారెంటీగా.. పార్టీ అధిష్టానానికి వంద అసెంబ్లీ, 15 లోక్ సభ సీట్లను గ్యారెంటీ ఇచ్చారని అంటున్నారు. ఎల్బీ స్టేడియం సభలో ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, కాదంటే, ఖర్గే ద్వారా పార్టీ అధినేత రాహుల్ గాంధీకీ.. మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా.. రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు సహకారం అందిస్తాం  అంటూ ఇచ్చిన హామీ..  మూడేళ్ళు తనను ముఖ్యమంత్రి పదవిలో కొంసగించాలని చేసిన అభ్యర్ధనగానే  భావించవలసి ఉంటుదని పరిశీలకులు భావిన్తున్నారు. అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుర్చీని కాపాడుకునెందుక చేసిన ప్రయత్నం సక్సెస్’ అయినట్లేనా అంటే..  తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఖర్గే సంతృప్తి  చెందినట్లే ఉందని అంటు న్నారు. అంతే కాకుండా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారిగా కులగణన చేయించిందని, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేసిన వ్యాఖ్యాలు రేవంత్ రెడ్డి సర్కార్  కు అధ్యక్షులవారు ఇచ్చిన సర్టిఫికేట్ గానే భావించవలసి ఉంటుందంటున్నారు. అలాగే..  ఖర్గే తన ప్రసంగంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం కూడా  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన కితాబుగానే  ముఖ్యమంత్రి అనుచరగణం పేర్కొంటున్నారు. అయితే.. ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమత్రి కుర్చీకి గ్యారెంటీ  ఇస్తుందా? అంటే అలా అనుకునే అవకాశం లేదని అంటున్నారు. ఖర్గే సంతృప్తి చెందితే సరిపోదనీ, హై కమాండ్ సంతృప్తి చెందితేనే.. ఏ ముఖ్యమంత్రి కుర్చీయినా నిలబడుతుందనీ లేదంటే ఏమి జరగాలో అదే జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కర్ణాటకలో ముఖ్యమత్రి మార్పు విషయంగా ఖర్గే  అది పార్టీ హై కమాండ్ పరిధిలోని అంశమనీ,  హై కమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో ఎవరూ చెప్పలేరంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి మార్పు తన చేతిలో లేదని ఖర్గే చేతులెత్తేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో అయినా, తెలంగాణాలో అయినా  హై కమాండ్ ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటే ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడలేక పోవచ్చని అంటున్నారు.
రేవంత్ సర్కార్ కు ఖర్గే  కితాబు! Publish Date: Jul 5, 2025 2:21PM

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయ‌న‌ అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.   వైద్య పరీక్షలలో కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలియడంతో అవి సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.  జ్వరం అదుపులోనికి రావడం, సుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి రావడంతో ఆయన ఈ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు శుక్రవారం ఆయన ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో ఆక్కడే ఆయన ఇష్ఠాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రైతుల కష్టాలు, యూరియా లభ్యత, సాగునీరు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై ఆయన వారితో ముచ్చటించారు.   అదే సమయంలో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు.  బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో మీడియా ముందుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక నేపధ్యంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ Publish Date: Jul 5, 2025 1:32PM

అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర?

జూలై 9న జ‌గ‌న్ మామిడి టూర్ సీజన్ అయ్యాకా వచ్చి ప్రయోజనమేంటంటున్న రైతులు చిత్తూరు జిల్లా మామిడి వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై  9న జ‌గ‌న్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వ‌చ్చి ఇక్క‌డి రైతుల‌ను ప‌ర‌మార్శించ‌నున్నారు. కార‌ణం ఈ రైతుల‌కు త‌గిన ధ‌ర లేక అవ‌స్థ  ప‌డుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా  వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అంటే తెలియందేముంది. వైసీపీ శ్రేణులు, నేతలు రెచ్చిపోయి ప్రకటనలు గుప్పించేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటి వారు జగన్ వస్తున్నాడనే సరికి తెలుగుదేశం కూటమి నేతలు వణికి పోతున్నారంటూ మాట్లాడేస్తున్నారు. అయితే రైతులు మాత్రం జగన్ ఓదార్పు అంటూ చేయనున్న యాత్రపై పెదవి విరుస్తున్నారు.  సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్ర‌యోజ‌న‌మేంట‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మా హ‌యాంలో మేం రూ. 4 వేలు స‌బ్సిడీ ఇచ్చాం.  మీ హ‌యాంలో  మీరేం ఇచ్చార‌ని నిల‌దీస్తున్నారు స్థానిక తెలుగుదేశం లీడ‌ర్లు.  ఈ రాజకీయ‌ పోరాటాల‌ను అటుంచితే.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే.. ఇక్క‌డ టేబుల్ ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. తోతాపురి ర‌కాల‌ను ఎక్కువ‌గా పండించారు. కార‌ణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వ‌ర‌కూ గుజ్జు ప‌రిశ్ర‌మ‌లున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ ర‌కాల‌నే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వ‌ర్షాలు  కూడా స‌కాలంలో ప‌డడంతో మామిడి దిగుబ‌డి భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ త‌గ్గింది. ఇదంతా అలా ఉంచితే.. ఇప్ప‌టికే ల‌క్ష క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండి పోయింది. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమ‌తి చేయ‌లేక పోతున్నారు. స్థానికంగా అమ్మ‌గ‌లిగే ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు కొంటాయ‌న్న భావనతో పండించిన తోతాపురిని ఎవ‌రూ కొన‌డం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వ‌ల‌ను అమ్ముకోలేక పోవ‌డంతో.. గుజ్జు ప‌రిశ్ర‌మ‌లు మామిడిని కొన‌డం ఆపేశాయి. దానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ సిండికేట్ గా ఏర్ప‌డి.. మేలో తెర‌వాల్సిన ఫ్యాక్ట‌రీలు ఇంకా తెర‌వ‌కుండా నానుస్తున్నారు. దీంతో దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయాడు మామిడి రైతు.  వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మామిడి రైతును ఆదుకోవ‌డంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయ‌ల‌ను  కేటాయించింది. ఇదే అద‌నుగా భావించిన మాజీ సీఎం జ‌గ‌న్ ఇక్క‌డా రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆరాట‌ప‌డుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కార‌ణం ఏమిటంటే జగన్ రావడం వల్ల అనవసర అలజడి తప్ప మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు, మార్కెట్ యార్డు ప్రతినిథులు తెగేసి చెప్పడమే.  అది ఆయ‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం పోరాటమైతే..  ఇక్క‌డ రైతులది జీవ‌న పోరాటం. వారి క‌డ‌గండ్ల‌ను కూడా జ‌గ‌న్ క్యాష్ చేసుకోడానికి రావ‌డం తమకు సుతరామూ ఇష్టం లేదంటున్నారు స్థానిక మామిడి రైతులు.
అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర? Publish Date: Jul 5, 2025 1:18PM

దిగి రానున్న టోల్ చార్జీలు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.    ఎప్పుడో  2008లో టోల్‌ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్‌ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. ఈ సవరింపుల కారణంగా  సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారుల మార్గాల్లో టోల్‌ ఫీజు లెక్కింపు పద్ధతి మారుతుంది. ఈ మార్పు కారణంగా టోల్ చార్జీలు దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య వాహన యజమానులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది.   వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల విభాగాలకు టోల్ రేటు తాజా సవరింపులతో 50 శాతం వరకూ తగ్గుతుంది.  
దిగి రానున్న టోల్ చార్జీలు! Publish Date: Jul 5, 2025 11:07AM

క‌మ‌లం ద‌క్షిణాది జపం?

ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, ద‌గ్గుబాటి  పురంధ‌రేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్.. ఈ ముగ్గురికీ కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. నిర్మ‌లా సీతారామ‌న్ ఆల్రెడీ ఆర్ధిక మంత్రిగా సుప్ర‌సిద్ధం. ఆమెను జాతీయ అధ్య‌క్షురాలిని చేస్తే.. అత్యంత కీల‌క‌మైన‌ ఆర్ధిక శాఖ నిర్వ‌హ‌ణ ఎవరికి అప్పగించాలన్నదొక చర్చ?  ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తరువాత అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖే.  అంతే కాకుండా   మోడీ పాల‌సీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అత్యంత ప్రధానమైన.. మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ. ఇక్క‌డ   పీక‌లోతు ప‌ని ఉంటుంది. అందులోంచి ఆమె ఇటు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని మోయాల్సి రావ‌డం అంటే అది సాధ్య‌మేనా? అన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఒక వేళ పార్టీ పగ్గాలు నిర్మలా సీతారామన్ కు అప్పగిస్తే.. రాష్ట్రపతిగా ఒక మహిళకు పట్టం గట్టడమే కాకుండా పార్టీ పగ్గాలు మరో మహిళకు అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుంది.  అందు కోసం  ఆర్ధిక శాఖ‌ను మరొకరికి ఇచ్చి నిర్మలా సీతారామన్ కు పార్టీ పగ్గాలు అప్పగించే యోచన హైకమాండ్ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  మోడీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా ప‌ని చేస్తూ అధ్య‌క్షులు ఉన్నవారు ఎవరు అంటే..  అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ  న‌డ్డా ఉన్నారు.  వారు ఇటు మంత్రి పదవి  నిర్వ‌హిస్తూనే అటు అధ్య‌క్ష బాధ్య‌త‌లూ  చేప‌ట్టారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌డ్డా కేంద్ర ఆరోగ్య మ‌రియు ర‌సాయ‌న  శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాబట్టి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్షురాలైతే ఆమె జోడు గుర్రాల సవారీ చేయాల్సి ఉంటుంది. ఇక ద‌గ్గుబాటి  పురందేశ్వ‌రిని జాతీయ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిని చేయాల‌న్న ఆలోచ‌న‌తో అధిష్టానం ఉందంటున్నారు. ఇప్ప‌టికే ఆమె ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క భూమిక పోషించారు. దీంతో కేంద్ర అధిష్టానం ముందు ఆమె ర్యాంకింగ్ బాగా పెరిగిన‌ట్టు తెలుస్తోంది. ఇచ్చిన టాస్క్ ఇచ్చిన‌ట్టు నెర‌వేర్చ‌డంలో మోడీ షాల ద‌గ్గ‌ర‌ పురందేశ్వ‌రికి గుడ్ మెరిట్సే ఉన్నాయి. కాబ‌ట్టి ఆమెకు  పార్టీలో కీలక ప‌ద‌వి ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇక వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఎవ‌ర‌ని చూస్తే అంత డీఎంకే  హ‌వాలోనూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోయంబ‌త్తూర్ సౌత్ లో అది కూడా ఒక పార్టీ అధ్య‌క్షుడైన క‌మ‌ల్ హాస‌న్ పై గెలిచారామె. ప్ర‌స్తుతం త‌మిళ శాస‌న స‌భ‌లో ఉన్న ఏకైక బీజేపీ మ‌హిళా నేత‌.  ఒక ర‌కంగా చెబితే ముగ్గురూ ముగ్గురే. ఇప్ప‌టికే నిర్మ‌లా సీతారామ‌న్ జీఎస్టీ  ద్వారా  దేశ ఆర్ధిక స్థితిగ‌తుల‌ను మెరుగు పరిచిన ఆర్ధిక మంత్రిగా ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో బ‌ల‌మైన పొజిష‌న్లోనే ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షుడు జేపీ  న‌డ్డా, ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ తో  ఆమె భేటీ అయ్యారు. బేసిగ్గా  జేపీ  న‌డ్డా అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం 2023 జ‌న‌వ‌రితోనే ముగిసింది. అయితే  2024 లో ఎన్నిక‌ల కార‌ణంగా జూన్ వ‌ర‌కూ పొడిగించారు. అప్ప‌టికీ ఏడాది గ‌డ‌చిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.  సరిగ్గా ఇక్కడే పార్టీ పగ్గాలను మహిళా నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.  అది కూడా ద‌క్షిణాది మ‌హిళకు అప్పగించాలని అనుకుంటోంది. ఎందుకంటే ఇటు చూస్తే ఉత్త‌రాదిలో బీజేపీ  సీట్లు బాగా త‌గ్గ‌డం ప్రారంభించాయి. గ‌త ఎన్నిక‌ల్లో చావు ద‌ప్పి  క‌న్నులొట్ట‌బోయిన ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది నుంచి గట్టి మద్దతు అవసరం ఉందని బీజేపీకి ఉంది.   అప్ప‌టికీ ద‌క్షిణాదిని క‌వ‌ర్ చేయ‌డానికి ఎన్నెన్నో ప్ర‌యోగాలు ప్ర‌య‌త్నాలు అవార్డులు- రివార్డులు- రాజ్య స‌భ్య‌త్వాలు ఇచ్చి చూస్తున్న బీజేపీకి త‌గిన గురి కుద‌డం లేదు. ద‌క్షిణాదిలో కేంద్ర మంత్రి ప‌ద‌వులు పొందిన  వారెవ‌ర‌ని చూస్తే తెలంగాణ  నుంచి ఇద్ద‌రు ఎంపీలు కిష‌న్, బండి సంజ‌య్. ఇక కేర‌ళ నుంచి సురేష్ గోపీ మాత్ర‌మే బీజేపీ  నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ కావ‌ల్సింది ఒక సౌత్ ఐకానిక్ ఫేస్. ఒక ప‌క్క స‌నాత‌న  వార‌ధిగా సార‌ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎంక‌రేజ్ చేస్తూ సైడ్ వ‌ర్క్ ప్రారంభించింది  బీజేపీ అధినాయ‌క‌త్వం. అయితే సౌత్ కి ఒక బ‌ల‌మైన బీజేపీ ముఖ‌చిత్రం లేదు. గ‌తంలో ఎలా  చూసినా కూడా క‌నిపించిన ఒకే ఒక్క ఫేస్. య‌డ్యూర‌ప్ప‌. ఆయ‌న ఎరా ముగియ‌టంతో.. ఇప్పుడు కొత్త ముఖ‌చిత్రం అందునా మ‌హిళ అయితే బాగుండున‌ని చూస్తున్నారు. అలాగ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ని అధ్య‌క్షురాలిగా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం మ‌హిళా కేట‌గిరికి మాత్ర‌మే స‌రిపోతుంది. బేసిగ్గా బీజేపీని గెలిపించిన మ‌హిళా ఓట‌ర్లు అధికశాతం గ‌ల రాష్ట్రాలేవ‌ని చూస్తే అవి మ‌హారాష్ట్ర‌, హ‌రియాణా, ఢిల్లీ.  అలా చూసినా కూడా సౌత్ లో ఏ స్టేట్ కూడా ఈ కేట‌గిరీ కింద‌కు రాదు. దానికి తోడు నిర్మ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల ప‌రిధిలోకి రాని  లేడీ లీడ‌ర్. ఆమె ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చెన్నై లోని ఒక నియోజ‌క‌వ‌ర్గం  నుంచి బీజేపీ  త‌ర‌ఫున బ‌రిలోకి దిగుదామ‌నుకున్నారు కానీ, ఎందుకో అది వ‌ర్క‌ట్ కాలేదు.  దానికి తోడు స్వ‌యంగా ఆమె.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో నిల‌బ‌డి ఖ‌ర్చు చేసేంత స్థోమత త‌న‌కు లేద‌ని తెగేసి చెప్పారు. సరిగ్గా అదే స‌మ‌యంలో ద‌క్షిణాదిలో గెల‌వాలంటే కులం గానీ, మ‌తం గానీ ఎక్కువ చూస్తార‌ని తెగేసి చెప్పిన స్వ‌భావం గ‌ల‌వారామె. ఈ క్ర‌మంలో నిర్మ‌ల కేవ‌లం ఒక ముఖ‌చిత్రంగా మాత్ర‌మే ఉంటారు త‌ప్పించి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలను ప్ర‌భావం చేసే ప‌రిస్థితి పెద్ద‌గా  క‌నిపించ‌డం లేదు. ఇక పురందేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఈ ఇద్ద‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అనుభ‌వ‌జ్ఞులుగానే చెప్పాలి. పురందేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీ  నుంచి రాజ‌మండ్రి ఎంపీగా గెలిచారు కూడా. ఈ లెక్క‌న పురందేశ్వ‌రికి మంచి ఛాన్సులు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ త‌న‌య‌గా మాత్ర‌మే కాదు అటు బ‌హుభాషా కోవిదురాలిగానూ పేరు. గ‌తంలో  కేంద్ర మంత్రిగా  ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌టం వ‌ల్ల‌.. ఆమెకు  నేష‌న‌ల్ లెవ‌ల్ ఎక్స్ పోజ‌ర్ కూడా ఉంది. అంతేనా ఇటీవ‌లి కాలంలో ఆమె ఆప‌రేష‌న్ సిందూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ టూర్ లో ఒసభ్యురాలు కూడా. అంటే అంత‌ర్జాతీయంగానూ ఆమె త‌న స‌త్తా చాటారు. కాబ‌ట్టి.. అధ్య‌క్ష ప‌ద‌వికి ఈమె స‌రిగ్గా స‌రిపోతారు. కానీ అధిష్టానం ఆలోచ‌న ఎలా ఉందో తెలీదు. ప్ర‌స్తుతానికైతే పురందేశ్వ‌రికి బీజేపీ మ‌హిళా మోర్చా ప‌ద‌వి అయితే ఇచ్చేలా తెలుస్తోంది.  వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఇప్పుడిప్పుడే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు కాబ‌ట్టి ఎంతైనా ఆమె జూనియ‌ర్ కిందే లెక్క‌. పార్టీ ప‌ద‌వులు ఎన్ని చేసినా.. వాటిని నేష‌న‌ల్ ఎలెక్ష‌నీరింగ్ స్థాయికి కి విస్త‌రించాలంటే అందుకు  త‌గిన అనుభ‌వం కూడా అవ‌స‌రం. కాబ‌ట్టి ఈ ముగ్గురిలో బెస్ట్ సౌత్ ఫిమేల్ ఫ్యాక్ట‌ర్ ఆప్ష‌న్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తేలాల్సి ఉంది.
క‌మ‌లం ద‌క్షిణాది జపం?  Publish Date: Jul 5, 2025 10:43AM

ఘోషా మహల్ కూ ఉప ఎన్నిక?!

తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలలో ఆశావహులు తమతమ ప్రయత్నాలు షురూ చేసేశారు. అయితే జూబ్లీహిల్స్ కు మాత్రమే కాదు.. రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమన్న పరిస్థితులు నెలకొన్నాయి.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినప్పటికీ.. ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం రాజసింగ్ తీరు పట్ల బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉందని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని నేడో, రేపో బీజేపీ అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయనీ అంటున్నారు. తెలంగాణ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖరాయాలన్న నిర్ణయం జరిగిపోయింది.  మొదటి నుంచీ రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహంగానే ఉందంటున్నారు. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడం, ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. పార్టీ చర్యలు తీసుకునేలోగానే ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి.. కావాలంటే తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసుకోండి అని సవాల్ కూడా చేశారు. దీంతో ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతూ లేఖ రాయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందంటున్నారు.     అందుకే ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ వెంటనే ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరిన వెంటనే అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావించలేం. ఒక వేళ స్పీకర్ బీజేపీ కోరిన మేరకు రాజాసింగ్ పై అనర్హత వేటు వేస్తే కనుక జూబ్లీహిల్స్ తో పాటే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఇది జరగాలంటే.. జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూల్ విడుదలయ్యే లోగా బీజేపీ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి, స్పీకర్ ను అనర్హత వేటు వేయాలంటూ లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖకు స్పీకర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  
 ఘోషా మహల్ కూ ఉప ఎన్నిక?! Publish Date: Jul 5, 2025 10:24AM

కొనసాగుతున్న అమరనాథ్ యాత్ర.. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై)   ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సరిగ్గా 38 రోజుల తరువాత అంటే ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది.   ఈ యాత్రలో భక్తులు హిమాలయాల్లోని అమరనాథ్ గుహలో  మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు.   బాల్తాల్, పహల్గామ్ మార్గాల గుండా ఈ యాత్ర సాగుతుందిజ అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తుఅల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 581 కంపెనీల కేంద్ర సాయుధ  బలగాలు, డ్రోన్లు,   జామర్లతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  
కొనసాగుతున్న అమరనాథ్ యాత్ర.. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు Publish Date: Jul 5, 2025 9:38AM

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!

  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..! Publish Date: Jul 5, 2025 9:30AM

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం (జులై 4) తిరుమల ఘాట్ రోడ్డులో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. అటవీ అధికారులు వాటిని అడవులలోకి మళ్లించాయి. అయితే శనివారం (జులై 5)న జిల్లాలోని పులిచర్ల మండలం పాత పేట అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామానికి అతి సమీపంలో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు మామిడి, అరటి, టమాటా తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పొలాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపును దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  
పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు Publish Date: Jul 5, 2025 9:19AM

సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు

మేడారం సమ్మక్క సారలమ్మ   గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయాలకు భిన్నంగా ఏకపక్షంగా సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పునకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అమ్మవారి గద్దల వద్ద ఆదివాసి గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నారు.   ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన గద్దెల డిజైన్‌ను మార్చనున్నారు. మేడారంలోని ఐటీడీఏ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన మహాజాతర సమీక్ష సమావేశంలో దేవాదాయ ఆర్కిటెక్ట్‌ రాజశేఖర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా స్క్రీన్  పై గద్దెల డిజైన్‌ను ప్రదర్శించారు.  2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గద్దెల కొత్త డిజైన్ ను ఆదివాసీ సంఘాలు మేడారం పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు Publish Date: Jul 5, 2025 9:07AM