Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సభకు నో పర్మిషన్.. పవన్ ప్రెస్ మీట్ తో సరిపెట్టేస్తారా?
posted on: Jun 2, 2026 11:24AM

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి.
అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండటం, అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
పోలీసుల నిర్ణయంతో ఏమాత్రం వెనక్కి తగ్గని జనసేనాని పవన్ కళ్యాణ్, తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహానికి తెరలేపారు. సభకు బ్రేక్ పడినా, తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో జనసేన భవిష్యత్ యాక్షన్ ప్లాన్, పార్టీ పటిష్టతకు తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఆయన నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్ మీట్ ద్వారా తన పొలిటికల్ ఎజెండాను బలంగా చాటాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు, పోలీసుల నిరాకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. రేపు మధ్యాహ్నం లోగా కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. కోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో యువత టార్గెట్గా, దాదాపు 50 శాతం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా, తెలంగాణలోనూ జనసేన సత్తా చాటాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగాల్సిన సభకు బ్రేక్ పడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





