ఆ కేసుల ఆధారాలు భద్రం!

posted on: Feb 9, 2026 1:50PM

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం (ఫిబ్రవరి 7) సంభవించిన అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేయడానికే అగ్నిప్రమాదాన్ని సృష్టించారంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ కూడా  ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక డేటా లక్ష్యంగా ఈ ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖాగోయెల్ స్పందించారు.

ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మొదటి అంతస్తులోని కంపూటర్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిందన్న ఆమె.. ఈ అగ్ని ప్రమాదంలో ఇతర విభాగాలకు ఎటువంటి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.   ఈ అగ్నిప్రమాదంలో వివిధ కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం కాలేదన్నారు.   ఓటుకు నోటు కేసుకు సంబంధించిన 16 ఆధారాల విశ్లేషణ   నివేదిక, ఆధారాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని చెప్పారు. అలాగే  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన 136 ఆధారాల్లో ఏడు మినహా మిగతా వాటిని విశ్లేషించి సంబంధిత కోర్టుకు అందజేశామని, మిగతా ఏడు ఆధారాలూ  కూడా భద్రంగా ఉన్నాయని తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...