ఏపీ మండలి చైర్మన్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం?!

posted on: Mar 4, 2026 10:40AM

ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ పై వైసీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతున్నారా?  అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. స్వయంగా వైసీపీకి చెందిన మండలి చైర్మన్  మోషేనురాజుపై వైసీపీ ఎమ్మెల్సీలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమేంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

 అయితే  మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. దీంతో వారు టెక్నికల్ గా ఇంకా వైసీపీ ఎమ్మెల్సీలుగానే ఉన్నారు. దీనిపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వారు మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలే కాకుండా.. రాజీనామా యోచనలో ఉన్న మరో ముగ్గురు వైసీపీ సభ్యులు కూడా ఈ అవిశ్వాస తీర్మానానిని మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో  ఇక ఆ దిశగా అడుగులు వేయాలని వారు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.  మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన  పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణలు సమాయత్తమౌతున్నారని అంటున్నారు. 

ఇలా ఉండగా ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసిన ఈ ఐదుగురూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనీ, వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు మండలి  ఛైర్మన్  విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీకి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు నిర్ణయించుకోవడం రాజకీయంగా అత్యంత  ప్రాధాన్యత సంతరించుకుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...