Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నీతిఆయోగ్ ర్యాంకింగ్స్.. ఏపీ స్థానం ఎక్కడ?
posted on: Jul 18, 2026 3:03PM

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వాతావరణంపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్ 'ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ఐఎఫ్ఐ తాజా ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానానికి, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6వ స్థానానికి పరిమితమైంది. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్స్లో వరుసగా అగ్రస్థానంలో నిలిచిన ఏపీ, ఇప్పుడు టాప్-5 పెర్ఫార్మర్స్ జాబితాలో చోటు కోల్పోవడం పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడటం రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది.
గతంలో కేంద్రం నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని నిలిపివేసి, మరింత సమగ్రంగా పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్ ఈ ఏడాది నుంచే సరికొత్తగా 84 సూచికలతో కూడిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ 48.7 శాతం మార్కులతో ఫ్రంట్ రన్నర్' విభాగంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 47.3 శాతం మార్కులతో 13వ స్థానాన్ని పొందింది. ఈ కొత్త ర్యాంకింగ్స్లో గుజరాత్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిస్సాలు టాప్-5 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతిపాదిత పెట్టుబడుల్లో ( ఏకంగా 25.3 శాతం వాటాను ఒంటరిగా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తున్నప్పటికీ, ఈ ర్యాంకింగ్స్లో ఎందుకు వెనుకబడాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆరోపిస్తున్నాయి. అయితే.. జాతీయ మీడియా కథనాలు, పారిశ్రామికవేత్తల స్పందనను పరిశీలిస్తే ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనేది వాస్తవం. మరి నీతి ఆయోగ్ ర్యాంకు తగ్గడానికి గల కారణమేంటంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన విఘాతంగా అర్ధమౌతున్నది.
రాష్ట్రానికి ఉన్న భారీ అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఏపీ మార్కులు తగ్గడానికి ముఖ్య కారణమని నీతి ఆయోగ్ విశ్లేషించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా 6లక్షల 36 వేల కోట్ల రూపాయల అప్పు ఉండగా, బడ్జెటేతర అప్పులతో కలిపి మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా భారం పేరుకుపోయింది. దీనికి తోడు.. గత కొన్ని సంవత్సరాలుగా సంక్షేమ పథకాల కోసం ఆదాయానికి మించి చేసిన వ్యయం వల్ల రాష్ట్రానికి 'ఆర్థిక వెసులుబాటు కరవైంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహా సంక్షేమ ఖర్చులు, వారంతపు ఆర్బీఐ అప్పులపై ఆధారపడటం ఈ ఇండెక్స్లో ప్రతిఫలించింది.
మరోవైపు, బిజినెస్ క్లైమేట్ విభాగంలో కూడా ఏపీ 9వ స్థానానికే పరిమితమైంది. నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులను వేగవంతం చేస్తూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళుతోంది. నీతి ఆయోగ్ సైతం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచడానికి, విధాన స్థిరత్వాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. రాష్ట్రం త్వరితగతిన మళ్లీ టాప్ పెర్ఫార్మర్ల జాబితాలోకి చేరాలంటే.. అనవసర వృధా ఖర్చులను నియంత్రించుకుంటూ, పటిష్టమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడమే ఏకైక మార్గం.
NITI Aayog Rankings, Andhra Pradesh, Investment Friendly Index AP, AP Business Climate Rank, Andhra Pradesh Economy Debts Ease of Doing Business AP



.webp)


