సవతి తల్లితో ఆ బంధం.. నిర్మల్ సుపారీ మర్డర్ కేసులో ట్విస్ట్..!

posted on: Jul 24, 2026 5:49PM

 

చివరికి మర్డర్  చేయించింది కూడా సవతి తల్లే..!

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వెలుగుచూసిన దారుణ హత్యోదంతం సమాజంలో తీవ్ర కలకలం రేపింది. సవతి కొడుకుపై పెంచుకున్న వ్యామోహం, అతడు దూరం జరుగుతున్నాడనే పగ, చివరికి ఒక ఘోరమైన సుపారీ హత్యకు దారితీసింది. నిర్మల్ జిల్లా వైఎస్సార్ కాలనీ పరిధిలోని ఈడెన్ గార్డెన్ సమీపంలో నడిరోడ్డుపై జరిగిన అస్లాం ఖాన్ ఘోర హత్య వెనుక ఉన్న దిగ్భ్రాంతికర కోణాలను నిర్మల్ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన కుట్రదారు అన్వరీ బేగంతో పాటు మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర సుపారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, మృతుడు అస్లాం ఖాన్ తన సవతి తల్లి అయిన అన్వరీ బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. అయితే సమాజంలో అందరిలాగే తాను కూడా గౌరవప్రదంగా పెళ్లి చేసుకుని, నూతన జీవితాన్ని ప్రారంభించాలని అస్లాం ఖాన్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అన్వరీ బేగానికి స్పష్టంగా తెరిపేశాడు. కానీ, అతడి నిర్ణయాన్ని అన్వరీ బేగం తీవ్రంగా వ్యతిరేకించింది. పెళ్లి చేసుకోవద్దని, తమ అక్రమ సంబంధం ఇలాగే కొనసాగాలని ఒత్తిడి తెచ్చింది. ఆర్థికంగా ఎంత సహాయమైనా చేస్తానని, ఒకవేళ వినకుండా పెళ్లి చేసుకుంటే ప్రాణాలు తీయిస్తానని తీవ్రంగా హెచ్చరించింది. అయినా అస్లాం ఖాన్ ఆమె మాట వినకపోవడమే కాకుండా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు బహిర్గతం చేయడంతో వివాదం కాస్త పెద్దదై బట్టబయలైంది.

తన అక్రమ సంబంధం సమాజంలో బయటపడి పరువు పోయిందనే తీవ్ర ఆగ్రహం, అలాగే అస్లాం ఖాన్ తనను వదిలేసి మరో యువతిని వివాహం చేసుకుంటాడనే కక్ష అన్వరీ బేగం మనసులో రగిలింది. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని పక్కా పథకం రచించింది. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన ముఖీద్ అనే వ్యక్తితో ఏకంగా రూ. 6 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా రూ. 50,000 అడ్వాన్స్ మొత్తాన్ని కూడా హంతకులకు చెల్లించింది. అస్లాం ఫొటోలు, అతడి రోజువారీ కదలికలు, దినచర్యను నిందితులకు నిరంతరం అందిస్తూ, ఈ కుట్రలో తన సొంత తమ్ముడు షేక్ మహమ్మద్‌ను కూడా భాగస్వామిని చేసింది.

సుపారీ గ్యాంగ్ మొదటగా జులై 1న స్థానిక ఆసుపత్రి వద్ద అస్లాం ఖాన్‌ను హత్య చేసేందుకు మొదటి ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో, జులై 15న రెండోసారి పక్కా రెక్కీ నిర్వహించి పథకాన్ని అమలు చేశారు. జులై 15 ఉదయాన్నే మహారాష్ట్ర నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన సుపారీ ముఠా, పోలీసుల కంటికి చిక్కకుండా ఉండేందుకు తమ వాహనం నంబర్ ప్లేట్ చివరి అంకె "6"ను తీసివేసింది. వైఎస్సార్ కాలనీ ఈడెన్ గార్డెన్ సమీపంలో వాహనాన్ని నిలిపి మాటు వేసింది. ఆ సమయంలో అన్వరీ బేగం ఫోన్లో నిరంతరం సమాచారం ఇస్తూ, అస్లాం వస్తున్న ఆటోకు నల్ల జెండాలు ఉన్నాయని, అతడు నల్ల చొక్కా ధరించాడని పక్కా క్లూస్ అందించింది.

అస్లాం ఖాన్ ఆటోలో వస్తుండగా సుపారీ హంతకులు అతడిని నడిరోడ్డుపై అడ్డుపడి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన అస్లాం ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘోరం జరిగిన వెంటనే నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిలా ఐపీఎస్ ఆదేశాల మేరకు 4 ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ ఎస్‌డీపీఓ పి. శ్రీనివాస్ నేతృత్వంలో సీఐ ఎం.కృష్ణ, ఎస్సైలు లింబాద్రి, శ్రీకాంత్, గోపీ, గణేష్, సాయికృష్ణల బృందం సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వేగవంతమైన దర్యాప్తు చేపట్టింది. నాందేడ్ మార్గంలో నిందితుల ఆచూకీ కనిపెట్టి ప్రధాన కుట్రదారు అన్వరీ బేగంతో పాటు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్కార్పియో కారు, ఒక మోటార్ సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు అన్వరీ బేగాన్ని రిమాండ్‌కు తరలించి, సుపారీ ముఠాను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Nirmal supari murder case, Anwari Begum arrested, Aslam Khan killing, Nirmal crime news, Telangana police murder case, Maharashtra supari gang

google-ad-img
    Related Sigment News
    • Loading...