గాదె ఇన్నయ్యపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్

posted on: Jun 19, 2026 11:05AM

 

హైదరాబాద్‌లోని నాంపల్లి  ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సీపీఐ (మావోయిస్టు) కార్యకర్త గాదె ఇన్నయ్యపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2025 అక్టోబర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కథ రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన సంతాప సభను మావోయిస్టు భావజాల ప్రచారానికి వినియోగించారని ఎన్‌ఐఏ ఆరోపించింది.

ఛార్జ్‌షీట్ ప్రకారం, సభలో గాదె ఇన్నయ్య చేసిన ప్రసంగం మావోయిస్టు సిద్ధాంతాలను సమర్థించేలా, ప్రజలను ప్రభావితం చేసేలా ఉందని పేర్కొంది. సభకు హాజరైన సుమారు 200 మందిని మావోయిస్టు భావజాలాన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. "విప్లవం చనిపోకూడదు" అంటూ సంస్థ భావజాలాన్ని కొనసాగించాలని, ఉద్యమాన్ని మరింత విస్తరించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆరోపించింది.

లొంగిపోయిన మాజీ మావోయిస్టు క్యాడర్లను బహిరంగంగా విమర్శించడంతో పాటు, వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని వ్యాఖ్యానించినట్లు కూడా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అలాగే ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ మావోయిస్టు నాయకులతో గాదె ఇన్నయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

'భారత్ బచావో' పేరుతో పనిచేస్తున్న ఫ్రంటల్ సంస్థ ద్వారా మావోయిస్టు భావజాల ప్రచారంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని, ప్రజాసభలు, సమావేశాలు, స్మారక కార్యక్రమాలను సంస్థ సిద్ధాంతాల వ్యాప్తికి వేదికగా ఉపయోగించారని ఎన్‌ఐఏ ఆరోపించింది. ఈ కేసులో గాదె ఇన్నయ్యను 2025 డిసెంబర్‌లో అరెస్టు చేసిన అధికారులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిషేధిత ఉగ్రవాద సంస్థకు మద్దతు, ఉగ్రవాద భావజాల వ్యాప్తికి కుట్ర వంటి అభియోగాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిషేధిత సంస్థలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...