ఔషధ రంగంలో కొత్త అలజడి: ట్రంప్ టారిఫ్ టెర్రర్.!

posted on: Jul 23, 2026 5:38PM

 

భారత ఔషధ రంగానికి అత్యంత కీలకమైన విదేశీ వ్యాపార వేదికగా అమెరికా మార్కెట్ కొనసాగుతోంది. అయితే, ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకురావాలని ప్రతిపాదించిన 200 శాతం  సుంకాల విధానంఇండియన్  ఫార్మా ఎగుమతిదారులలో  ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఏకంగా 200 శాతం వరకు పన్నులు విధించే అవకాశముందని వచ్చిన వార్తలు గ్లోబల్ సరఫరా వ్యవస్థలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ అసాధారణ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలు, అమెరికా ఆరోగ్య రక్షణ వ్యవస్థపై దాని ప్రభావం, భారతీయ కంపెనీలకు ఉన్న బలాలు ఏంటనే దానిపై ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార వ్యవహారం మాత్రమే కాక, అంతర్జాతీయంగా ఔషధ లభ్యత,  ధరలపై ప్రభావం చూపే అంశం. 

అమెరికా యంత్రాంగం ప్రతిపాదించిన సుంకాల అమలు విధానం ఒకేసారి కాకుండా దశలవారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రారంభంలో ఆగస్టు 1, 2026 నుండి జూలై 31, 2028 వరకు సున్నా శాతం సుంకం కొనసాగుతుందనీ, ఆ తర్వాత ఆగస్టు 2028 నుంచి జూలై 2029 నాటికి 100 శాతానికి పన్ను పెరుగుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఆ తదుపరి కాలం అంటే ఆగస్టు 2029 నుంచి పన్ను భారాన్ని ఏకంగా 200 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.

అమెరికాలో ఉపయోగిస్తున్న జెనెరిక్ ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 47 శాతం మందులు ఇండియా నుంచే సరఫరా అవుతున్నాయి. మొత్తం విలువ పరంగా చూసినా 30 శాతం వాటా భారత్‌దే కావడం విశేషం. అత్యంత తక్కువ ఉత్పత్తి వ్యయంతో నాణ్యమైన మందులను అందించగలగడమే భారతీయ పరిశ్రమ సాధించిన ప్రధాన విజయం.

గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఫార్మా మార్కెట్ విధానాలు నిరంతరం మార్పులకు లోనవుతున్నాయి. 1984 లో వచ్చిన హాచ్-వాక్స్మన్ చట్టం ద్వారా అక్కడ జెనెరిక్ ఔషధాల వినియోగానికి పెద్ద పీట వేశారు. నాటి నుంచి అమెరికన్ ఫార్మా సంస్థలు లాభాలు తక్కువగా ఉండే ఉత్పత్తుల తయారీని ఇండియా, చైనా వంటి ఆసియా దేశాలకు అప్పగించడం ప్రారంభించాయి. తత్ఫలితంగా ప్రపంచానికే   ఫార్మా హబ్‌గా ఆవిర్భవించింది.

అయితే స్థానిక తయారీని ప్రోత్సహించే దిశగా అమెరికా ప్రభుత్వం పాత చట్టాల ఆధారంగా చర్యలు చేపడుతోంది. 1962 నాటి ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ లోని సెక్షన్ 232 ని ఉపయోగించి జాతీయ భద్రత పేరుతో ఈ దిగుమతి సుంకాలను సమర్థించుకునే ప్రయత్నం జరుగుతోంది. మొదట్లో బ్రాండెడ్ ఉత్పత్తులకే పరిమితమైన పన్ను ప్రతిపాదనలు, క్రమంగా అన్ని రకాల ఔషధాల దిగుమతులపైకి విస్తరించడం గమనార్హం.

టారిఫ్ వార్తలు వెలువడగానే  ఇండియన్ షేర్ మార్కెట్లో ఫార్మా రంగానికి చెందిన కంపెనీల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. నిఫ్టీ ఫార్మా సూచీ పతనమవ్వడమే కాకుండా, అరబిందో, లుపిన్ వంటి ప్రముఖ సంస్థల షేర్ విలువ తగ్గింది. కానీ మరోవైపు అమెరికాలోనే పనిచేస్తున్న పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

అమెరికాలో కొత్తగా ఫార్మా ప్లాంట్ నిర్మించి, ఎఫ్‌డిఏ   అనుమతులు పొంది ఉత్పత్తులు ప్రారంభించడానికి కనీసం 3 నుంచి 7 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రభుత్వం వేగవంతమైన అనుమతుల కోసం పైలట్ ప్రోగ్రామ్‌లు తెచ్చినప్పటికీ, ఆచరణలో అతి తక్కువ సమయంలో అక్కడ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సుంక పెంచడం ద్వారా అమెరికాలోనే స్వదేశీ తయారీ   వస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, దానివల్ల చివరికి నష్టపోయేది అక్కడి సాధారణ పౌరులేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అక్కడ వైద్యం  వ్యయం చాలా ఎక్కువగా ఉంది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే భారతీయ జెనెరిక్ ఔషధాల ధరలు 7 నుంచి 10 రెట్లు తక్కువగా ఉంటాయి.

ఒకవేళ 100 శాతం లేదా 200 శాతం సుంకం విధించినప్పటికీ, భారత జెనెరిక్ మందుల ధరే బ్రాండెడ్ మందుల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. దీనితో ఆ సుంకాల భారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటల్స్ చివరికి రోగులపైనే వేసే అవకాశముంది. దీనివల్ల అమెరికాలోనే తీవ్రమైన మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.

ఈ విధమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత ఫార్మా రంగానికి కొన్ని మౌలికమైన అనుకూలతలు ఉన్నాయి. నిర్మాణ వ్యయంలో భారత్‌కు 40 నుంచి 60 శాతం వరకు స్పష్టమైన ప్రయోజనం ఉనికిలో ఉంది. నాణ్యమైన మానవ వనరులు, తక్కువ వేతనాలు, విస్తృతమైన అనుభవం ఉన్న ఎఫ్‌డిఏ ఆమోదిత ప్లాంట్లు ఇందుకు ప్రధాన కారణం.

సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, జైడస్, లుపిన్ వంటి దిగ్గజ సంస్థలకు ఇప్పటికే అమెరికా స్థానిక భూభాగంలోనూ కొన్ని ఆమోదిత ప్లాంట్లు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా కొత్త సౌకర్యాలను నిర్మించాల్సిన అవసరం లేకుండానే, ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించి కొంత తయారీని అక్కడికి మార్చే వీలుంది. ఈ పరిస్థితుల్లో ఒకే మార్కెట్‌పై పూర్తిగా ఆధారపడకుండా ఉండటానికి భారత ప్రభుత్వంతో పాటు ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) సన్నాహాలు ప్రారంభించాయి. అమెరికా మార్కెట్‌తో పాటు ఐరోపా, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతులను మరింత పెంచుకోవాలని భారతీయ కంపెనీలు ప్రణాళికలు వేస్తున్నాయి.

అదే సమయంలో మందుల తయారీకి అవసరమయ్యే కీలకమైన ముడిపదార్థాల   విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా గుర్తించాయి. ఎగుమతుల వైవిధ్యీకరణ ద్వారా ఏ   దేశ విధానాలపైనా అతిగా ఆధారపడకుండా ఉండేలా సుదీర్ఘ వ్యూహాన్ని భారత్ సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతానికి అమెరికా సుంకాల ప్రతిపాదనలు తీవ్రమైన హెచ్చరికగా కనిపిస్తున్నప్పటికీ, ఆర్థిక, రవాణా పరమైన వాస్తవాలను పరిశీలిస్తే వీటి అమలులో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఆరోగ్య సంరక్షణ రంగాన్ని కాపాడుకోవడం అమెరికాకు ఎంత కీలకమో,  చవకైన మందుల సరఫరా కూడా అంతే అవసరం.

అందువల్ల రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల ద్వారా ఒక మధ్యస్థ మార్గం సుగమం కావచ్చునని భావిస్తున్నారు. భారత జెనెరిక్ పరిశ్రమ తన నాణ్యత మరియు వ్యయ అనుకూలత అనే బలమైన పునాదులతో ఈ సవాలును కూడా అధిగమించి అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటుందని వ్యాపార వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

Trump Pharma Tariffs, Indian Generic Drugs, Nifty Pharma, US FDA Compliance, Generic Medicine Export, Indian Pharma Companies, Reshoring Pharma

google-ad-img
    Related Sigment News
    • Loading...