Latest News

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ కేసులో తెరపైకి కొత్త పేరు!

posted on: Mar 30, 2026 1:01PM

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డిది కావడం, ఇక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎంపీ కూడా పట్టుబడటంతో ఈ కేసు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకుని విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇందులో భాగంగానే  ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడిని సిట్ గుర్తించింది.  గోవాలో డీజేగా పనిచేస్తున్న క్లింటన్ అనే వ్యక్తి  ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ తేల్చింది.  క్లింటన్ తో ఈ కేసులో నిందితుల సంఖ్య 16కు పెరిగింది.

వివరాల్లోకి వెడితే.. ఈ కేసులో ఇటీవల అరెస్టయిన జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు కోలా బాలాజీ పటేల్‌కు క్లింటన్ ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించింది.   గోవా నుంచి అందిన ఈ డ్రగ్స్‌ను బాలాజీ ద్వారా పైలట్ రోహిత్‌రెడ్డి,  అతడి స్నేహితులు గతంలోనూ పలుమార్లు వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో  వెల్లడైంది. 

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు నిందితులు రాకేశ్‌ వర్మ, అభిషేక్ సింగ్‌, క్లింటన్‌తో పాటు మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మలు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.  ఈ నెల 14న జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీలో కేవలం కొకైన్ మాత్రమే కాకుండా, మరో రెండు  రకాల మాదకద్రవ్యాలను కూడా వాడినట్లు పోలీసులు  గుర్తించారు. అయితే సోదాల్లో కేవలం కొకైన్ మాత్రమే లభించింది.

అయితే వైద్య పరీక్షల్లో నిందితుల రక్త నమూనాల్లో యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ వంటి పదార్థాలు కూడా బయటపడటంతో క్లింటన్ పంపిన ఎండీఎంఏ కూడా అక్కడ వినియోగించినట్లు సిట్ అనుమానిస్తోంది. డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ప్రముఖులు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో క్లింటన్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...