సీఎం రేవంత్‌ను కలిసిన నూతన డీజీపీ సీవీ ఆనంద్‌

posted on: Apr 29, 2026 4:47PM

 

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలని సూచించారు.1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ను రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతల స్వీకరణ: ప్రస్తుత డీజీపీ బి.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీవీ  ఆనంద్ మే 1న అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సి.వి. ఆనంద్ తన సేవా ప్రయాణాన్ని వరంగల్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ప్రారంభించి అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. అదనపు ఎస్పీగా ఆదిలాబాద్‌లో, ఎస్పీగా నిజామాబాద్‌లో పనిచేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్‌గా సేవలందించిన ఆయన 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 

2016 నుంచి 2018 వరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సంస్కరణలు అమలు చేశారు. అనంతరం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ  డైరెక్టర్‌గా 2018 నుంచి 2021 వరకు పనిచేశారు. 2021 నుంచి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, ఏసీబీ డైరెక్టర్ మరియు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కూడా సేవలందించారు. 2024 నుంచి 2025 వరకు మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి, 2025 సెప్టెంబర్ నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...