దేశ భద్రతకు కొత్త సవాల్.. హైటెక్ ఉగ్రవాద నెట్ వర్క్

posted on: May 16, 2026 3:06PM

 

ఇండియా సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు సరికొత్త సవాలు విసురుతూ..  దేశీయంగా విస్తరిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల ఛేదించింది. గ్లోబల్ టెర్రర్ ఆర్గనైజేషన్ ఐసిస్ సిద్ధాంతాలతో ప్రభావితమైన ఈ ఉగ్ర ముఠా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పాగా వేసి వినాశనానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో లాగా కేవలం సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ముప్పు మాత్రమే కాకుండా, దేశం లోపలే ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దాడులకు తెగబడేలా ఈ కొత్త తరం ఉగ్రవాద మాడ్యూల్ రూపుదిద్దుకోవడం అంతర్గత భద్రతా విభాగాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చదువుకున్న యువతను, సాంకేతిక నిపుణులను వల వేసి పట్టుకుంటూ ఈ ముఠా దేశంలో సుదీర్ఘకాలం పాటు అరాచకత్వాన్ని సృష్టించాలని చూస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.  కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్లేషణ ప్రకారం, పాతకాలపు స్లీపర్ సెల్స్ తరహాలో కాకుండా ఇవి అత్యంత పటిష్టమైన బహుళస్థాయి నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త తరం గ్రూపులలో కేవలం అక్షరాస్యులే కాకుండా సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం ఉన్నవారు, ఇంజనీరింగ్ పట్టభద్రులు కూడా చేరడం గమనార్హం. వీరంతా తుపాకులు పట్టే సాంప్రదాయ పద్ధతులను వీడి, ల్యాప్‌టాప్‌ల ద్వారా కోడింగ్ చేస్తూ, ఎన్‌క్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్ల సాయంతో సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. అంతేకాకుండా, ఆన్‌లైన్ వేదికలుగా అంతర్జాతీయ స్థాయి నుంచి రహస్యంగా నిధులు సేకరించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు సాంకేతిక తోడ్పాటు అందించడంలో ఈ వైట్ కాలర్ ఉగ్రవాదులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.  

భద్రతా సంస్థలను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఈ ముఠాలు కేవలం ఇంటర్నెట్ కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తీవ్రమైన శిక్షణను కూడా పొందాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని అత్యంత దట్టమైన అడవులను ఎంచుకుని, అక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిర్మానుష్య ప్రాంతాలలో అధునాతన ఆయుధాల వాడకం, బాంబుల తయారీ విధానాలు మరియు నిఘా కంటికి చిక్కకుండా తిరిగే మెలకువలపై రహస్య శిక్షణ సాగింది. సమాజంలో సాధారణ పౌరులుగా చలామణీ అవుతూనే, అంతర్గతంగా ఇలాంటి వినాశకర శిక్షణలో పాల్గొనడం దేశ రక్షణ రంగానికి పెద్ద సవాలుగా మారింది.  మరోవైపు, నిఘా,  దాడుల ప్రణాళికల కోసం వీరు ఆధునిక డ్రోన్ సాంకేతికతను విరివిగా ఉపయోగించారు. వ్యూహాత్మక ప్రాంతాలను, రక్షణ సంస్థల కార్యాలయాలను డ్రోన్ల ద్వారా ఫోటోలు,  వీడియోలు తీసి మ్యాపింగ్ చేశారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడానికి వీలుగా సురక్షితమైన మార్గాలను కూడా ఈ డ్రోన్ల సహాయంతోనే ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

మహారాష్ట్రలోని పుణే పరిసర ప్రాంతాల్లో వీరు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి సరికొత్త  టెక్నో-ఐఈడీ  బాంబులను తయారు చేయడమే కాకుండా..  వాటి సామర్థ్యాన్ని పరీక్షించడానికి నియంత్రిత పేలుళ్లు కూడా జరిపారు. ఈ దాడుల వెనుక ఆకిఫ్ నచన్, షామిల్ సకీబ్ నచన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిందితులు నేరుగా పాల్గొన్నట్లు ఎన్ఐఏ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది.  ఈ మొత్తం నెట్ వర్క్ విస్తృతిని పరిశీలిస్తే, ఇది కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాలేదు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, మధ్యప్రదేశ్,  జార్ఖండ్ వంటి ఆరు ప్రధాన రాష్ట్రాలలో ఈ ముఠా తన నెట్వర్క్‌ను బలంగా విస్తరించింది. పశ్చిమ భారతదేశాన్ని తమ ప్రధాన కార్యకలాపాల కేంద్రంగా మార్చుకుని ముంబై, థానే, పుణే వంటి నగరాల నుంచి వ్యూహాలు అమలు చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా జరిగే నియామకాలు, నిధుల సరఫరా,  దాడులను ఒకే చోటు నుంచి సమన్వయం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లో ఒక కేంద్రీకృత  కమాండ్ సెంటర్ లేదా ఏర్పాటు చేయాలనే బ్లూప్రింట్ కూడా వీరి వద్ద లభించింది. 

ఇది స్థానిక ఉగ్రవాదం నుండి పాన్-ఇండియా స్థాయి వ్యవస్థీకృత ఉగ్రవాదంగా మారుతున్న తీరుకు అద్దం పడుతోంది.  ఈ భారీ నెట్ వర్క్ వెలుగుచూడటం వెనుక రెండేళ్ల సుదీర్ఘ దర్యాప్తు దాగి ఉంది. 2022లో రాజస్థాన్‌లో ఒక కారులో దొరికిన పేలుడు పదార్థాలు,  డెటోనేటర్ల కేసు విచారణలో  సుఫా టెరర్ గ్యాంగ్ లింకులు బయటపడ్డాయి. ఆ కేసును లోతుగా పరిశీలించగా, ఆ ఉగ్రవాదులకు పుణే ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత 2023 జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో ఏకకాలంలో జరిపిన మెరుపు దాడులలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు, బాంబు తయారీదారులు పట్టుబడ్డారు. చివరకు నవంబర్ 2023లో దాఖలు చేసిన నివేదికలలో, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు అంతర్జాతీయ శక్తులతో వీరు జరిపిన కుట్రల పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి.  అంతేకాకుండా, ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాల వెనుక ఆర్థిక విధ్వంసక కోణాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ నోట్ల చెలామణి, హవాలా మార్గాల ద్వారా టెర్రర్ ఫండింగ్ నిర్వహించడం వంటి పద్ధతులు దేశ ఆర్థిక వ్యవస్థను లోపల నుంచే బలహీనపరిచే  స్లో పాయిజన్ లాంటివని నిపుణులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం ఉగ్రవాదం అనేది కేవలం భౌతిక దాడులకే పరిమితం కాకుండా, డిజిటల్ డేటా, ఆర్థిక వ్యవస్థ,  తప్పుడు ప్రచారాల  ద్వారా సమాజంలో అస్థిరతను సృష్టించే ఒక బహుముఖ యుద్ధంగా రూపాంతరం చెందింది.  సాంఘిక మాధ్యమాల ద్వారా యువతను తప్పుదోవ పట్టించడం, రహస్య యాప్‌ల ద్వారా కొత్త సభ్యులను చేర్చుకోవడం మరియు బయో-టెర్రరిజం వంటి ప్రమాదకరమైన అంశాలపై కూడా రక్షణ సంస్థలు నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ దేశాలలో కనిపిస్తున్న లోన్ వుల్ఫ్ దాడుల సంస్కృతి,  ఆన్‌లైన్ రాడికలైజేషన్ ధోరణులు ఇప్పుడు భారతదేశంలోనూ భద్రతా ముప్పుగా మారుతున్నాయి. అందువల్ల కేవలం క్షేత్రస్థాయిలో ఉన్న నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, వారి వెనుక ఉండి నడిపించే ఆర్థిక మూలాలను, తప్పుడు ప్రచార వ్యవస్థలను,  డిజిటల్ ఎకోసిస్టమ్‌ను పూర్తిగా తుడిచిపెట్టినప్పుడే దేశానికి అసలైన రక్షణ లభిస్తుందని భద్రతా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...