నేపాల్‌కి మూగ జీవాల ఉసురు తగిలిందా?

posted on: Apr 29, 2015 5:35PM



నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయేలా చేసింది. భూకంపం సంభవించిన నాటి నుంచి రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొత్తమ్మీద  భూకంప మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం వుందని నేపాల్ అధికారవర్గాలే చెబుతున్నాయి. ఈ సంఖ్య పదిహేను వేలు దాటే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ వేలాదిమంది మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. భూకంపం ధాటికి ఇప్పటికే నేపాల్ ఎంతో నష్టపోయింది. రాబోయే రోజుల్లో ప్రకృతి నేపాల్ మీద మరింతగా పగబట్టే ప్రమాదం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో నేపాల్‌లో భారీ వర్షాలు కురవబోతున్నాయట. ఈ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం వుందని భావిస్తున్నారు. ఇప్పటికే నేపాల్‌లో అనేక ప్రాంతాల్లో జనం నిలువ నీడలేక ఆరుబయటే నివసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కురిసే భారీ వర్షాలు నేపాల్ ప్రజల పాలిట మృత్యు శాసనాలు అయ్యే ప్రమాదం వుంది. ఇలా వుంటే, నేపాల్‌లో మూగ జీవుల పట్ల చూపించే క్రూరత్వమే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమని కొంతమంది జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు.

నేపాల్‌లోని బారా జిల్లాలోని బరియాపూర్‌లో గంధిమాయ్ అనే అమ్మవారి దేవాలయం వుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఐదు సంవత్సరాలకోసారి పశువులను బలి ఇచ్చే ఉత్సవం జరుగుతుంది. ఈ బలి ఉత్సవంలో ఒకేరోజు లక్షలాది పశువులను బలి ఇస్తారు. నేపాల్‌తోపాటు నేపాల్ సరిహద్దులో వున్న భారతీయ గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడ పశువులను బలి ఇస్తూ వుంటారు. మొన్నీమధ్య నవంబర్ 23, 2014న ఈ బలి ఉత్సవం జరిగింది. ఒకే రోజున రెండు లక్షల యాభై వేల పశువులను తెగనరికారు. అత్యంత దారుణమైన ఈ దురాచారాన్ని ఆపాలని పెటా లాంటి సంఘాలు నేపాల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ఇది సంప్రదాయంతో ముడిపడిన అంశం కావడంతో నేపాల్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. ఇలా అయిదేళ్ళకోసారి లక్షల సంఖ్యలో పశువులను బలి ఇవ్వడం వల్లే ఇప్పుడు భూకంపం వచ్చి నేపాల్ అల్లకల్లోలం అయిపోయిందని జంతు ప్రేమికులు అంటున్నారు. నేపాల్‌కి మూగ జీవాల ఉసురు తగిలిందని చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...