"సింహపురి" జగన్‌ నుంచి చేజారిపోనుందా..?

posted on: May 12, 2016 5:43PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి..వైఎస్ జగన్‌కు కంచుకోట లాంటి నెల్లూరులో ఫ్యాన్ రెక్కలు టపటపా ఊడిపోతున్నాయి. అన్ని రెక్కలు కలిసి..సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. వైసీపీకి పట్టున్న..టీడీపీ బలం తక్కువగా ఉన్న జిల్లాలపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందుకే ఆ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. అది మంచి రిజల్ట్ ఇవ్వడంతో మిగతా జిల్లాల్లో కూడా వర్కవుట్ చేయాలని టీడీపీ అధినేత ప్లాన్ గీస్తున్నారు. 10 అసెంబ్లీ స్థానాలున్న నెల్లూరు జిల్లాలో వైసీపీ గడచిన ఎన్నికల్లో 7 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అధికార తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ఎదురులేకుండా చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేశారు బాబు.

 

అందుకే జిల్లాపై పూర్తిస్థాయి పట్టున్న ఆనం బ్రదర్స్‌ను టీడపీలోకి చేర్చుకున్నారు. పనిలో పనిగా వైసీపీ ఎమ్మెల్యేలను సైకిలెక్కించుకుంటున్నారు. ఇప్పటికే గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చివరి శ్వాస వరకు జగన్‌తోనే అని అంటూనే వైసీపీకి షాక్ ఇచ్చారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ, ఆనం బ్రదర్స్‌తో పలు విడతలుగా మంతనాలు జరిపిన ప్రతాప్ స్పష్టమైన హామీ కోసం ఎదురు చూశారు. ఈ సీఎంతో కూడా సమావేశమైన రామిరెడ్డి ఒకటి, రెండు డిమాండ్లు మినహా మిగిలిన వాటన్నింటికి ఆయన నుంచి హామీ తీసుకున్నారట. దీంతో సైకిలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆ పర్యటన నుంచి ఈ నెల 15న విజయవాడకు తిరిగి రానున్నారు. అనంతరం ఈ నెల 18న రామిరెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో నెల్లూరులో సైకిల్ బలం 5కు చేరనుంది. ఇదిలా ఉంటే రామిరెడ్డి బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మహానాడులోపు ఈ ఇద్దరు కూడా టీడీపీలోకి చేరే అవకాశం ఉంది. మొత్తం మీద వైసీపీ కంచుకోటలైన కర్నూలు, నెల్లూరు జిల్లాలు త్వరలో టీడీపీ పరం కానున్నాయి. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...