కోచింగ్ మాఫియా, పొలిటికల్ లింక్స్... నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ ఛార్జిషీట్.!

posted on: Jul 30, 2026 3:19PM

దేశ వ్యాప్తంగా కోట్ల మంది వైద్య విద్యాభ్యర్థుల భవిష్యత్తును  తేల్చే నీట్-యూజీ 2026  పేపర్ లీక్  జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతను ప్రశ్నించేలా మారింది.  నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ..  ఢిల్లీ ప్రత్యేక కోర్టులో సంచలనాత్మక ఛార్జిషీట్‌  దాఖలు చేసింది. ఈ కేసు కేవలం సాధారణ ప్రశ్నపత్రాల లీకేజీ కాదని, కోచింగ్ మాఫియా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అంతర్గత నిపుణులు,  రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న  పెద్ద   కుట్ర అని పేర్కొంది. 

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ప్రముఖ ఆర్‌సీసీ (ఆర్సీసీ) కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావ్‌కర్.. ఎన్‌టీఏ నియమించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లతో కుమ్మక్కై కెమిస్ట్రీ ప్రశ్నపత్రాన్ని ముందే సంపాదించినట్లు ఆధారాలు లభించడంతో కేసు ఊహించని మలుపులు తిరిగింది.  ఈ దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమిటంటే, నిందితుడైన మోటెగావ్‌కర్‌కు ఉన్న రాజకీయ పరిచయాలు, సన్నిహిత సంబంధాలు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ తరఫున ఆయన  ప్రచారం చేసిన రికార్డులు వెలుగులోకి రావడం వల్ల ఈ కుంభకోణం చుట్టూ  రాజకీయ దుమారం రేగుతోంది. సిబిఐ తన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, నీట్ కెమిస్ట్రీ పేపర్‌ను రహస్యంగా పొందడానికి మోటెగావ్‌కర్ ఎన్‌టీఏ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పి.వి. కులకర్ణికి రూ. 5 లక్షలు చెల్లించినట్లు స్పష్టమైంది. ఈ అక్రమ మార్గం ద్వారా చేతితో రాసిన ప్రశ్నపత్రాల చిత్రాలను సంపాదించి, తన కుమారుడితో పాటు కోచింగ్ విద్యార్థులకు అందజేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  నీట్-యూజీ 2026 పరీక్షలు మే 3, 2026న నిర్వహించగా, పరీక్షకు దాదాపు పది రోజుల ముందే అంటే ఏప్రిల్ 23 ప్రాంతంలోనే ఈ లీకేజీ నెట్‌వర్క్ క్రియాశీలకంగా మారింది. మొబైల్ ఫోన్ల మెటాడేటా విశ్లేషణ ఆధారంగా లీక్ అయిన కెమిస్ట్రీ ప్రశ్నల చిత్రాలు ఏప్రిల్ చివరి వారంలోనే  బయటకు వచ్చాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తరువాత  మే 12న ఉన్నత విద్యా శాఖ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది.  దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ  సహా వివిధ రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరిపింది. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ డివైజులు, కమ్యూనికేషన్ రికార్డులు, చేతితో రాసిన నోట్సులను స్వాధీనం చేసుకున్నారు.  జూలై చివరి వారంలో దాఖలైన ఈ ఛార్జిషీట్‌లో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు. ఎన్‌టీఏకి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు,, పి.వి. కులకర్ణి (కెమిస్ట్రీ), మనీషా మందారే (బయాలజీ), మనీషా హవాల్దార్ (ఫిజిక్స్) లతో పాటు కోచింగ్ నిర్వాహకుడు శివరాజ్ మోటెగావ్‌కర్, తేజస్ షా, కొందరు మధ్యవర్తులు, అలాగే దీనివల్ల నేరుగా లబ్ధి పొందిన విద్యార్థులను నిందితుల జాబితాలో చేర్చారు. బీఎన్ఎస్, అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024 లోని నిబంధనల కింద క్రిమినల్ కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాల విధ్వంసం వంటి నేరాలను మోపారు.  

డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా అధికారులు సేకరించిన ఆధారాలు ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మోటెగావ్‌కర్ మొబైల్ ఫోన్ నుండి మొత్తం 36 ఫొటోలను  దర్యాప్తు సంస్థ రికవరీ చేయగా, అందులో 132 చేతివ్రాతతో ఉన్న  కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నాయి. ఎన్‌టీఏ రూపొందించిన అధికారిక మాస్టర్ ప్రశ్నపత్రంతో ఈ ప్రశ్నలను పోల్చి చూసినప్పుడు, ఏకంగా 111 ప్రశ్నలు యథాతథంగా సరిపోలడం గమనార్హం. హ్యాండ్‌రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు, అకాడెమిక్ పోలికల ద్వారా ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని,   ప్రణాళికాబద్ధంగా జరిగిన   నేరపూరిత కుట్ర అని సిబీఐ బలమైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది.  

ఈ కుంభకోణానికి సంబంధించిన లీకేజీ నెట్‌వర్క్ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని, లాతూర్‌లోని రేణుకా, ఆర్‌సీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, పుణెలోని ఏపీఎంఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు వివిధ శాఖలతో ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర రాకెట్‌గా విస్తరించిందని తేలింది. నిందితుడు కులకర్ణి కోచింగ్ తరగతులకు మోటెగావ్‌కర్ కుమారుడు హాజరైన సమయంలోనే ఈ రహస్య సమాచార మార్పిడి జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. అంతేకాకుండా, పి.వి. కులకర్ణికి అందిన రూ. 5 లక్షల నగదును మరొక సహ నిందితుడి వద్ద నుంచి సీబీఐ రికవరీ చేయడం వల్ల  మనీ ట్రైల్ కు సంబంధించిన ఆర్థిక సాక్ష్యాలు మరింత బలపడ్డాయి.  ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, యువజన సంఘాల నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  జెన్ జీ( ప్రతినిధులు, విద్యార్థులు చేపట్టిన భారీ ఆందోళనలు దేశ దృష్టిని ఆకర్షించాయి. ఆందోళనల ధాటికి  రాజకీయ ఒత్తిడి పెరిగి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

అయితే..  నిజమైన విద్యార్థుల ఆవేదనను కొందరు కోచింగ్ వ్యాపారులు తమ స్వప్రయోజనాల కోసం, మళ్లీ పరీక్ష నిర్వహణ (Re-exam) లేదా గ్రేస్ మార్కుల కేటాయింపు పేరుతో వాడుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.  ఈ లీకేజీ ఘటనలతో భారతదేశంలో జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన ప్రవేశ పరీక్షల నిర్వహణ వ్యవస్థల్లోని  లోపాలు బహిర్గతమయ్యాయి. ఎన్‌టీఏ వంటి  స్వతంత్ర సంస్థలు అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని ప్రకటించినప్పటికీ, పరీక్ష పత్రాల రూపకర్తలే లీకేజీకి మూలంగా నిలవడం విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రతి ఏటా లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి చదివి రాసే పరీక్షలలో మెరిట్‌కు ప్రాధాన్యం దక్కకుండా, కోచింగ్ మాఫియా చేతుల్లో సీట్లు అమ్ముడుపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో ఈ ఛార్జిషీట్ విచారణ వేగవంతం కానుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం-2024 ప్రకారం మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని విద్యార్థి లోకం కోరుతోంది. ఎన్టీఏ వ్యవస్థలో మూలమట్టంగా మార్పులు తీసుకురావడం, నిపుణుల ఎంపికలో పారదర్శకత పెంచడం మరియు కోచింగ్ సెంటర్ల అక్రమ నెట్‌వర్క్‌లను పూర్తిగా అంతమొందించడం ద్వారా మాత్రమే భవిష్యత్‌లో జాతీయ పరీక్షలపై కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడం సాధ్యమవుతుంది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.      

NEET UG 2026 Paper Leak, CBI Chargesheet NEET, Shivraj Motegaonkar, Latur Coaching Class NEET Leak, NTA Paper Leak Scam, NEET Chemistry Paper Leak

google-ad-img
    Related Sigment News
    • Loading...