నీట్ పేపర్ లీక్ కేసులో ఐదుగురు అరెస్ట్

posted on: May 13, 2026 8:06PM

 

నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు, పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు విస్తరించిన భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం నుంచి వచ్చిన లిఖిత ఫిర్యాదు ఆధారంగా సీబీఐ మే 12న కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS), అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్–2024 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్, జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివెల్, వికాస్ బివెల్, దినేష్ బివెల్, గురుగ్రామ్‌కు చెందిన యష్ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీక్‌కు సంబంధించిన డిజిటల్ ట్రైల్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా గుర్తించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. ప్రాథమిక విచారణ చేపట్టిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ)తో కూడా సీబీఐ సమన్వయం కొనసాగిస్తోంది. 

విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేష్ బివెల్ సోదరులు ఈ లీక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. వీరు పరీక్షకు వారం రోజుల ముందే గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ పేపర్‌ను సికార్‌లో నీట్‌కు సిద్ధమవుతున్న తమ కుటుంబానికి చెందిన విద్యార్థికి అందజేశారు. అక్కడి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మందవారియా ద్వారా పేపర్ మరింత విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. తన వద్ద పనిచేసే కేరళకు చెందిన ఓ విద్యార్థికి రూ.30 వేలకే పేపర్ విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆ విద్యార్థి పరీక్షకు ముందు రోజు హాస్టల్‌లోని ఇతర విద్యార్థులకు కూడా ప్రశ్నపత్రాన్ని పంపినట్లు సమాచారం.ఈ కుంభకోణానికి రాజస్థాన్‌లోని సికార్ కేంద్రంగా మారినట్లు అధికారులు భావిస్తున్నారు. నాసిక్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైన ప్రశ్నపత్రం, మధ్యవర్తుల చైన్ నెట్‌వర్క్ ద్వారా గురుగ్రామ్ చేరినట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి జమ్మూకశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా పేపర్ చేరినట్లు ఆధారాలు లభించాయి. ఏజెంట్ రాకేష్ కుమార్ సుమారు 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో మే 3న నిర్వహించిన నీట్ యూజీ–2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేసును సీబీఐకి అప్పగించగా, దర్యాప్తు మరింత ముమ్మరంగా కొనసాగుతోంది. తదుపరి పరీక్ష తేదీలను 7 నుంచి 10 రోజుల్లో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...