కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటున్న సిద్ధూ..

posted on: Jul 19, 2016 4:44PM

భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన చూపు ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ రాజకీయాల్లో తక్కువ కాలంలోనే ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందారు సిద్దూ. సిద్దూ ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి ఆయనను పక్కకు తప్పించి, అరుణ్‌జైట్లీకి ఆ సీటు ఇవ్వడంపై సిద్దూ అలిగి ఉన్నాడు. ఇంత చేసినా తీరా జైట్లీ అక్కడ గెలవలేకపోయాడు. అప్పట్లో సిద్దూ బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించాడు. అతన్ని బుజ్జగిస్తూ రెండు నెలల కిందటే రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు కమలనాథులు.

 

అయితే త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 13 ఎంపీ సీట్లలో నాలుగు గెలుచుకున్న ఆప్ మరింత కష్టపడితే..ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడుతోంది. అందులో భాగంగానే ఆప్ సిద్దూతో సంప్రదింపులు జరిపింది. దీనిపై తీవ్ర తర్జన భర్జనలు పడ్డ సిద్దూ ప్రస్తుతానికైతే బీజేపీకి రాజీనామా చేశారు. సిద్దూ కోసం ఆప్ అంతగా ఆసక్తి చూపడానికి కారణాలున్నాయి. అంతకు ముందే టీమిండియా క్రికెటర్‌గా దేశవ్యాప్తంగా పేరున్న సిద్దూకు పంజాబ్‌ రాజకీయాల్లోనూ మంచి పేరుంది. స్వతహాగా మాటకారి అయిన ఆయన తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోవడంలో దిట్ట.

 

ఢిల్లీ తర్వాత పంజాబ్‌‌లోనే ఆప్ బలంగా ఉన్నా అక్కడ సరైన నాయకత్వం లేదు. ఢిల్లీకి చెందిన ఆప్ నేతలే అక్కడ కూడా కార్యకలాపాలు, ప్రచారం చేపడుతున్నారు. అయితే ఢిల్లీకి పంజాబ్‌కు సామాజికంగా, సాంస్కృతికంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే ఢిల్లీ నేతలు అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా నడిపించలేకపోతున్నారు. ఈ దశలో సిక్కు వర్గానికి చెందిన బలమైన నేత కోసం ఆప్ వెతుకుతోంది. ఈ ప్రయత్నంలో వారికి కనిపించిన వ్యక్తి సిద్దూ. మరి సిద్దూ ఆఫ్‌లో చేరుతారా..? లేక సిద్దూ విలువ తెలిసిన బీజేపీ తిరిగి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...