స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ మర్డర్‌ కేసులో మరో ట్విస్ట్‌... వెలుగులోకి కొత్త విషయాలు

 

సంచలనం సృష్టించిన భువనగిరి స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ పరువు హత్య కేసులో ఎల్బీనగర్‌ పోలీసులు.... హైకోర్టుకు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే చంపాడన్న పోలీసులు.... ఆధారాలు దొరకకుండా నరేష్‌ అస్థికలను మూసీ నదిలో కలిపారంటూ తెలిపారు. నరేష్‌ మర్డర్‌ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుందని... అయితే ఈ సంఘటనపైనా అనుమానాలున్నాయంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు.... ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. ఆత్మకూరు ఎస్సైను సస్పెండ్‌ చేయడంతోపాటు రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, భువనగిరి టౌన్‌ సీఐ శంకర్‌గౌడ్‌, చౌటుప్పల్‌ ఏసీబీ స్నేహిత, భువనగిరి ఏసీపీ మోహన్‌రెడ్డిలకు ఛార్జ్‌ మెమోలు ఇఛ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.

 

అయితే నరేష్‌ ఆచూకీ తెలపాలంటూ అతని తల్లిదండ్రులు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు క్లోజ్‌ చేసింది. నరేష్‌ హత్య చేయబడ్డాడంటూ పోలీసులు నివేదిక ఇవ్వడంతో ఇక విచారణ అవసరం లేదంటూ కేసును మూసివేసింది. అయితే పోలీసుల తీరుపై పలు అనుమానాలున్నాయని, దర్యాప్తు సరిగా సాగడం లేదని నరేష్‌ తండ్రి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు...  దర్యాప్తులో ఏమైనా అనుమానాలుంటే.... తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని నరేష్‌ తల్లిదండ్రులకు సూచించింది. ఇక నరేష్‌తోపాటు కూతుర్ని కూడా శ్రీనివాస్‌రెడ్డే చంపేశాడని నరేష్‌ తండ్రి ఆరోపించాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని నరేష్‌ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.

 

మరోవైపు నిందితులను ఐదురోజుల పోలీస్‌ కస్టడీకి భువనగిరి కోర్టు అనుమతించడంతో... మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇప్పటికే అనేక ట్విస్టులు, మలుపులు తిరిగిన ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటికొస్తాయో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu