ఏపీ "అన్నీ పెండింగ్".. నమో "నమ్మించి మోసం"
posted on: Nov 22, 2017 4:53PM

ప్రస్తుతం ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనడం కంటే అన్నీ పెండింగ్ అని అనుకోవడం మంచిదేమో అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ పై చిన్న చూపే దీనికి కారణం అని కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరైనా చెప్పొచ్చు. అసలే రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ కావాల్సినంత పాపం మూట గట్టుకుంది. దాంతో కాంగ్రెస్ కు ప్రజలు బాగానే బుద్ది చెప్పారునుకోండి. ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పైకి రావడం కూడా కష్టమే. అయితే అప్పుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు బీజేపీ పలికిన ప్రగల్బాలు తలుచుకుంటే ఇప్పుడు ఒళ్లు మండక తప్పదు. ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరితే...ఐదు సంవత్సరాలు ఏంటి.. మేము కనుక అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా సొల్లు మాటలు చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత కానీ వాళ్లకి సాకులు కనిపించాయి. ఆ చట్టం.. ఈ చట్టం అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. పోనీ ప్రత్యేక ప్యాకేజీ అయినా సరిగ్గా ఇస్తుందా అంటే అదీ లేదు. ఇప్పటివరకూ అతీ గతీ లేకుండా పోయింది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలన్నింటినీ విదేశీ రుణ ప్రాజెక్టుల ద్వారా అందజేస్తామని... విదేశీ రుణాల్లో 90 శాతాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
మరోపక్క ప్రభుత్వమేమో విదేశీ రుణం అందితేనే అభివృద్ధి పనులు చేపట్టవచ్చని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వమేమో.. ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద 30 శాతం నిధులు ఖర్చు చేస్తేనే మిగతా రుణం గురించి ఆలోచిస్తామని చెబుతోంది. అసలే రాష్ట్ర విడిపోయి రెవెన్యూ లోటుతో ఉన్న ఏపీ ముందు ఖర్చు ఎలా చేస్తదట. దీనివల్ల దాదాపు 19 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రం వద్ద అలానే పెండింగ్ లో ఉన్నాయి. ఒక రైల్వే జోన్ అయితేనేంటి.. పోలవరం ప్రాజెక్ట్, అసెంబ్లీ సీట్ల పెంపు, దుగరాజపట్నం పోర్టు వ్యవహారం... ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పనులు పెండింగ్ లో పడిపోయాయి. ఇక కాస్తో కూస్తో ఏపీకి సపోర్ట్ గా ఉన్న వెంకయ్యను కాస్త సైలెంట్ చేసేశారు. మరి ఎంతో నమ్మకంగా మోడీని నమ్ముకున్న చంద్రబాబుకు మోడీ మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు. మరి ఇలానే ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో దాని ఫలితం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం చూడక తప్పదనిపిస్తోంది.




.jpeg.jpg)

.webp)



