అప్పుడు శారద, ఇప్పుడు నారద... మమత మీద మోదీ విసుర్లు

posted on: Mar 28, 2016 11:35AM

 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్లో మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిన్న ఖరగ్‌పూర్‌లో జరిగిన ఒక భారీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అటు మమతాదీదీ మీదా ఇటు వామపక్ష కూటమి మీదా విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. మొదట్లో శారద స్కాంలో తృణమూల్‌ చిక్కుకుందనీ, ఇప్పుడేమో నారద అనే పత్రిక నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్లో పట్టుబడిందనీ ఎద్దేవా చేశారు. ఈ డబ్బంతా కూడా సామాన్య ప్రజల సొమ్మేనని గుర్తుచేశారు. తాము కేంద్రంలో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు అయినా కూడా, ఇప్పటి వరకూ ఒక్క అవినీతి ఆరోపణని కూడా ఎదుర్కోలేదని ప్రకటించారు.

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున మాట్లాడిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓ మహారాణిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పశ్చిమబెంగాల్లో ఏ పరిశ్రమా పెద్దగా అభివృద్ధి చెందలేదనీ, ఒక్క బాంబుల్ని చుట్టే పని మాత్రమే బాగా జరుగుతోందని అన్నారు. ఇక కాంగ్రెస్‌- వామపక్ష కూటమిని కూడా మోదీ ఏకిపారేశారు. కేరళలో శత్రువులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆ పార్టీలు, పశ్చిమబెంగాల్లో ఎలా కలిసి పనిచేస్తాయని ప్రశ్నించారు. మోదీ ఘాటైన ఎన్నికల ప్రచారంతో, అక్కడి బీజేపీ కూడా శక్తిని పుంజుకున్నట్లైంది. మరి ఈ ప్రచారం ఏ ఫలితానికి దారితీయనుందో!

google-ad-img
    Related Sigment News
    • Loading...