మోడీ మార్క్ పరిపాలన

posted on: Jun 11, 2014 6:36PM

 

ప్రధాని నరేంద్ర మోడి పాలనలో తనడైయిన ముద్రవేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. చిన్నమంత్రివర్గం-ఎక్కువ పరిపాలన అనే సూత్రం అమలు చేస్తూ కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటి బాధ్యత ఒకే మంత్రికి అప్పజెప్పారు. ప్రభుత్వానికి భారంగా మిగిలిన 21 కేంద్రమంత్రుల సాధికార బృందాలను రద్దు చేసి, తిరిగి కేంద్రమంత్రి వర్గానికే అన్ని అధికారాలు దాఖలు పరిచారు. మళ్ళీ నిన్న అటువంటివే మరో నాలుగు స్టాండింగ్ కమిటీలను వేరే కమిటీల అధీనంలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు జారీచేసారు.

 

తద్వారా కేంద్రమంత్రులకు మరిన్ని అధికారాలు, వాటితోబాటే బరువు బాధ్యతలు కూడా అప్పగించినట్లయింది. అందువలన ఇకపై కేంద్రమంత్రులు స్వతంత్రంగా వేగంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఏర్పడుతుంది. అంతేగాక తమ నిర్ణయాలకు తామే జవాబుదారీ అయ్యేలా చేసారు. కనుక మంత్రులు మరింత అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఐఏయస్, ఐపీయస్ వంటి ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ ప్రసాదిస్తూ వారిని రాజకీయ ఒత్తిళ్ళ నుండి విముక్తులు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

 

కేంద్రమంత్రులకు అధికారాలతో బాటు బాధ్యతలు కూడా అప్పగించి వారిలో జవాబుదారీతనం పెంచినట్లే ఉన్నతాధికారులకు కూడా మోడీ అదే సూత్రం వర్తింపజేయబోతున్నారు. మోడీ తన మంత్రివర్గ సభ్యులెవరూ తమ బంధువులను తమ కార్యదర్శులుగా నియమించుకోరాదని విస్పష్టంగా తేల్చిచెప్పారు. అంతే కాక కేంద్రమంత్రులు అందరూ కూడా మూడు నెలలలోగా తమ ఆదాయ, ఆస్తుల వివరాలను లికితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు.

 

మంత్రులందరూ వంద రోజులలో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలని, మళ్ళీ మూడు నెలల తరువాత వారి పనితీరుని సమీక్షిస్తానని అయన తొలి సమావేశంలోనే అందరినీ హెచ్చరించారు. మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఏనాడూ కూడా, ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకొన్న దాఖలాలు లేవు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.

google-ad-img
    Related Sigment News
    • Loading...