గవర్నర్కి అధికారాలా? సో వాట్?
posted on: Jun 17, 2015 7:59AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతికి అందించాలన్న పోరాటం ఊపు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 8 మీద ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉమ్మడి రాజధానిలో పోలీసు అధికారాలు ఒక్క రాష్ట్రం చేతిలోనే వుండటం వల్ల మరో రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. ఈ విషయంలో హైదరాబాద్లో నివసించే సీమాంధ్ర ప్రాంతం వారికి ఎన్నో భయాలు, సందేహాలు వున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సెక్షన్ 8ని తక్షణం అమలు చేయాల్సిన అవసరాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తోంది. అయితే ఈ డిమాండ్ని తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. గవర్నర్ చేతికి శాంతి భద్రతలను అప్పగించబోం అని స్పష్టంగా చెబుతోంది. అయితే నిజానికి శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్కి అప్పగించినందువల్ల ఏపీకి ఏమైనా ఉపయోగం వుందా అనే ఆలోచన పలువురిలో కలుగుతోంది.
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వున్న నరసింహన్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా వుంది. నరసింహన్ ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు’ అని అంటునప్పటికీ ఆయన ఏకపక్ష వైఖరి స్పష్టంగానే కనిపిస్తోందని పలువురు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 కింద గవర్నర్కి అధికారాలు ఇచ్చినా ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వున్న గవర్నర్ అధికారంలో వున్నప్పుడు ఏ సెక్షన్ అయినా హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజలు, ప్రభుత్వానికి రక్షణ కల్పించలేదని అంటున్నారు. అందువల్ల సెక్షన్ 8ని అమలు చేయడంతోపాటు నరసింహన్ని గవర్నర్ పదవి నుంచి తొలగించడమే సరైన పరిష్కార మార్గం అని పలువురు భావిస్తున్నారు.




.jpg)


.webp)


