నారా లోకేష్.. బ్రాండ్ న్యూలుక్.. తెగ వైరల్ అవుతున్న ఫొటోలు!

posted on: Jun 4, 2026 2:40PM

ఆంధ్రప్రదేశ్  ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రష్యాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ సదస్సులో  పాల్గొన్న లోకేష్ సరికొత్త కార్పొరేట్ అవతారంలో కనిపించడంతో  ఆ ఫోటోలు సోషల్ మీడియా లో తెగహల్‌చల్ చేస్తున్నాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

సాధారణంగా నారా లోకేష్ ప్రజల్లో ఉన్నప్పుడు లేదా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు తెల్లటి చొక్కా, బ్లూ  ప్యాంట్ ధరించడం ఒక  రివాజుగా మారిపోయింది. దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఆయన ఇదే సాధారణ వస్త్రధారణతో కనిపిస్తుంటారు. అయితే, రష్యా వేదికగా జరుగుతోన్న ఈ ఉన్నత స్థాయి సదస్సు కోసం ఆయన తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకుని నయా లుక్‌తో దర్శనమిచ్చారు.

ఈ అంతర్జాతీయ వేదికపై నారా లోకేష్ పూర్తి స్థాయి ఫార్మల్ సూట్ ధరించి ప్రత్యేకంగా నిలిచారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన బ్లేజర్ లేదా సెమీ ఫార్మల్ దుస్తుల్లో కనిపించినప్పటికీ..  ఈ సారి మాత్రం పక్కా ప్రొఫెషనల్ లుక్‌ను ఎంచుకున్నారు.  బ్లాక్ కలర్ బ్లేజర్, దానికి నప్పే ప్యాంట్,  టై ధరించి పూర్తి స్థాయి కార్పొరేట్ లుక్‌లో క్లాసీగా కనిపించారు. ఈ సరికొత్త రూపం ఆయనకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని తీసుకువచ్చింది.

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి థలపతి విజయ్ సైతం ఇటువంటి ఒక సెమీ ఫార్మల్ సూట్ ధరించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ మంత్రి లోకేష్ అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి..  పూర్తి స్థాయి ప్రొఫెషనల్ సూట్ లుక్‌తో అంతర్జాతీయ ప్రముఖుల మధ్య ఆకట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రష్యాలో జరుగుతున్న ఈ ఏఐ సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక రంగానికి ఎంతో కీలకం కానుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో దిగ్గజ సాంకేతిక సంస్థలు, నిపుణులు ఈ సదస్సులో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులను, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి లోకేష్  పర్యటన ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.

సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండి, నిరంతరం చురుగ్గా కదిలే ఐటీ మంత్రి రాష్ట్రానికి ఉండటం ఎంతో సానుకూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   మంత్రి లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఈ సదస్సు ద్వారా ఏపీకి భారీగా సాంకేతిక ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉందని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...