విజయం రోజాదేనా?

posted on: Apr 7, 2016 10:33AM

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నిన్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాల్సిందిగా కోరారు. సుమారు ఐదు నెలలు సాగిన ఈ యుద్థంలో విజేత..  కోర్టు తీర్పిచ్చినా రోజాను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వని టీడీపీ ప్రభుత్వానిదా? లేక రోజాదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా రోజాదే అని చెప్పవచ్చు. తెలుగు రాజకీయాల్లో మహామహులైన చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ చుట్టూ మీడియా ఎప్పుడూ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే రోజా సస్పెండ్ అయిన దగ్గరి నుంచి తెలుగు రాజకీయాల్లో రోజా హాట్ టాపిక్ అయ్యారు. సస్పెన్షన్ తర్వాత ఆమె నెక్స్ట్ స్టెప్ ఎంటీ అనే దానిపై రోజూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది మీడియా. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తెలుగుదేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే రోజా ఉపయోగించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.

 

 సస్పెన్షన్ కేసును ప్రత్యేకంగా విచారించాలని సుప్రీం,  హైకోర్టును ఆదేశించింది. దీంతో  రోజా సస్పెన్షన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం..స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదంటూ రోజాను సభలోకి అడుగుపెట్టనివ్వకపోవడం..దీనిపై ఆమె దీక్ష తదితర అన్ని పరిణామాలు జాతీయ స్థాయిలో రోజాకి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. చివరికి ప్రివిలేజ్ కమిటీ తనకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చేలా చేసుకుని ఈ కథకి క్లైమాక్స్ ఇవ్వాలనుకుంది. తన ప్లాన్ భాగంగా నిన్న క్షమాపణలు చెప్పింది. సగటు  రాజకీయ నాయకుడు కోరుకునేది నిత్యం జనాల్లో నానాలి అని అసెంబ్లీలో జగన్ గొంతు చించుకున్నా రాని పబ్లిసిటీ రోజాకి బయట నుంచే వచ్చింది. రేపు ఎన్నికల ప్రచారంలోనూ రోజా ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని లబ్థి పొందవచ్చు. బేసిగ్గా మంచి వాగ్ధాటి కలిగిన రోజా మామూలుగానే చెడుగుడు ఆడుకుంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా వదులుతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...