నాగార్జున తప్పు ఒప్పుకొన్నట్లేనా?
posted on: Jul 13, 2014 10:14PM
.jpg)
నాగార్జున తప్పు ఒప్పుకొన్నట్లేనా? సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్ కన్వెన్షన్ సెంటర్ కోసం 3 ఎకరాల 12 గుంటల ప్రభుత్వభూమిని ఆక్రమించినట్లు నిర్దారిస్తూ జీ.హెచ్.యం.సి. అధికారులు మార్కింగ్స్ వేసారు. దానిపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషను వేసారు కూడా. కానీ కోర్టు నాగార్జున పిటిషనుపై మరో విధంగా స్పందించింది. ఇటువంటి చర్యలు తీసుకొనే ముందు సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది తప్ప కూల్చివేతలు వద్దని వారించలేదు. అంటే ఈరోజు కాకపోయినా రేపయినా జీ.హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేయడం, ఆ వెనువెంటనే వారు గునపాలు, సమ్మెట్టలు పట్టుకొని తన కట్టడాలను కూల్చివేయడం అనివార్యమని గ్రహించిన నాగార్జున, అటువంటి అవమానకర పరిస్థితులనే చేజేతులా కోరితెచ్చుకోవడం కంటే, జీ.హెచ్.యం.సి. అధికారులు గుర్తించి మార్క్ చేసిన కట్టడాలను స్వయంగా తొలగించడం మంచిదని భావించినందునేమో, నిన్నటి నుండి తన యన్ కన్వెన్షన్ సెంటర్ లో కట్టడాలను కూల్చివేయిస్తున్నారు.
అయితే ఈవిధంగా చేయడం వలన జీ.హెచ్.యం.సి. అధికారులు ఆరోపిస్తున్నట్లు యన్ కన్వెన్షన్ సెంటర్ కోసం కోసం ప్రభుత్వభూమిని ఆక్రమించినట్లు స్వయంగా నాగార్జున అంగీకరించినట్లయింది. తను చట్టబద్దంగానే భూములను కొని వాటిలో నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నానని, వాటిని అక్రమ కట్టడాలని జీ.హెచ్.యం.సి. అధికారులు మార్కింగ్స్ వేయడం తప్పని నాగార్జున ఇంతవరకు కోర్టులో చేసిన వాదనలు కూడా పసలేనివేనని ఆయనే స్వయంగా ద్రువీకరించినట్లయింది. అందువల్ల బహుశః రేపటి నుండి చాలామంది నాగార్జునపై విమర్శలు గుప్పిస్తే అందుకు కూడా ఆయన సిద్దంగా ఉండాలేమో!



.jpg)
.jpg)

.webp)



