మ‌య‌న్మార్ అధ్య‌క్షుడి హామీ మన‌కెందుకంత కీల‌కం?

posted on: Jun 5, 2026 2:34PM

సైనిక నేతృత్వం వహిస్తున్న మ‌య‌న్మార్ ప్రభుత్వ‌ అధినేత మిన్ ఆంగ్ హ్లాయింగ్  తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌ను సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా  ఆయ‌నో కీలక హామీ ఇచ్చారు. భారత్ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మయన్మార్ భూభాగాన్ని ఉపయోగించడానికి అనుమతించబోమని అన్నారు. ఈ హామీ.. 1,643 కిలోమీటర్ల పొడవైన భారత్, మయన్మార్ సరిహద్దులోని క్రాస్ బార్డర్ దాడుల నేపథ్యంలో అత్యంత‌ కీలకంగా మారింది.  

మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్, 2026 జూన్ 1న న్యూఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. ఆయ‌న‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జ‌రిగిన‌ తొలి విదేశీ పర్యటన ఇది. ఈ ఐదు రోజుల పర్యటనలో వాణిజ్యం, భద్రత, అనుసంధానం, క్లిష్టమైన ఖనిజాలు, శాంతి ప్రక్రియపై చర్చలు జరిగాయి. 

2021 ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరగబాటు జరిగిన తర్వాత.. దేశంలో అంతర్గత అస్థిరత కొనసాగుతోంది. మయన్మార్ సైనిక జుంటా- ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఘటన తర్వాత.. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు- మయన్మార్ పై ప‌లు ఆర్థిక శిక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం సంప్రదింపుల ద్వారా ముందుకు సాగాలనే వ్యూహాన్ని అనుసరించింది. 

భారత్ వైఖరిలో స్పష్టమైన ఉద్దేశం ఏంటంటే, మయన్మార్‌లోని అంతర్గత రాజకీయ ఏర్పాట్లకు మద్దతు ఇవ్వ‌డం కాదు. కేవలం వ్యూహాత్మక, భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే, ఈ సంబంధాల కొన‌సాగింపు అనే ఆలోచ‌న చేస్తోంది భార‌త్. నిజంగా చెప్పాలంటే, భారత్‌కు మయన్మార్ అవసరం కేవలం వ్యూహాత్మకమే కాదు, అత్యవసరం కూడా. ఎందుకంటే 1,643 కిలోమీటర్ల సరిహద్దు వెంబ‌డి  సాగే ప్రమాదకరమైన క్రాస్-బార్డర్ దాడులు, తిరుగుబాటుదారుల కార్యకలాపాలు, ఇత‌ర‌త్రా ఆర్డర్లైన‌.. మద్యం, మందులు, ఆయుధాల క్రాస్-బార్డర్ తరలింపు భారత్‌కు ఎంతైనా ప్రమాదం. 

2021 ఫిబ్రవరిలో మయన్మార్ సైనిక తిరగబాటు జ‌రిగింది. సైన్యం అధికారం చేజిక్కించుకుంది, ప్రజాస్వామ్యం ప‌డ‌కేసింది. ఇక 2025 మేలో ఇండియన్ మిలిటరీ క్రాస్-బార్డర్ ఆపరేషన్
మయన్మార్ సరిహద్దులో.. కోవర్ట్ ఆపరేషన్ జ‌ర‌గ్గా, 9 మంది తిరుగుబాటుదారులను భారత్ హ‌తం చేసింది. 

2025 జూలైలో క‌ల‌డాన్  ప్రాజెక్టు 2027 నాటికి  పూర్తయ్యేలా ప్రకటన. భారత మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ప్రకటన చేశారు. 2026 మే 30న మయన్మార్ అధ్యక్షుడు భారత్ రావ‌డం, ఐదు రోజుల పాటు అధికారిక పర్యటన చేయ‌డం, 2026 జూన్ 1న మోడీ–మిన్ ఆంగ్ హ్లాయింగ్ సమావేశం జ‌ర‌గ‌డం.. ఈ మీటింగ్ లో..  భద్రత, వాణిజ్యం, అనుసంధానంపై చర్చలు జ‌రిగాయి. ఇక 2026 జూన్ 1న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సైతం ఈ విష‌యంపై ఒక ప్ర‌క‌ట‌న  చేశారు.. మ‌యన్మార్ భూభాగ దుర్వినియోగ కాద‌న్న‌ హామీ, భార‌త‌ సార్వభౌమత్వం పునరుద్ఘాటన ఇందులోని సారాంశం.  

మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు ఇచ్చిన  హామీ.. సార్వభౌమ దేశాల మధ్య అంతర్జాతీయ న్యాయం ప్రకారం కీలకమైన అంశం. ఒకరి భద్రతా ప్రయోజనాలకు మరొకరు హాని కలిగించే కార్యకలాపాల కోసం సార్వభౌమ భూభాగాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం అనే ప్రాముఖ్యతను ఇరుపక్షాలు స్ప‌ష్టం చేశాయి. 

ఈ హామీ కేవలం పొలిటిక‌ల్ కామెంట్ మాత్రమే కాదు. అంతర్జాతీయ స‌హ‌జ‌ న్యాయ సూత్రం ప్రకారం.. ఒక దేశం తన భూభాగం ద్వారా.. మరొక దేశానికి హాని కలిగించకుండా చూడాలి. కానీ, ఇక్క‌డ త‌లెత్తుతున్న‌ ప్రశ్న ఏమిటంటే.. ఈ హామీని అమలు చేయడానికి మయన్మార్ సైన్యం త‌గిన శ‌క్తి క‌లిగిఉందా? అనేది. 

భారత్ వైఖరి మయన్మార్ అంతర్గత రాజకీయ ఏర్పాట్లపై కాదు. ప‌ర‌స్ప‌ర‌ సంప్రదింపుల‌తో ముందుకు సాగడం. ఇదే ఇక్క‌డ కీల‌క‌మ‌ని అన్నారు విదేశాంగ కార్య‌ద‌ర్శి  మిశ్రీ. కానీ వాస్తవం ఏమిటంటే, భారత్‌కు మయన్మార్‌లో ప్రజాస్వామ్యం అవసరం, స‌రిగ్గా అదే స‌మ‌యంలో సరిహద్దు భద్రత అంత‌క‌న్నా మించిన‌ అత్యవసరం. అందుకే భారత్ ప్రజాస్వామ్యం, శాంతి, సమ్మిళితత్వం అనే ప‌దాల‌ను ప‌దే ప‌దే వ‌ల్లెవేస్తుంది, అందుకే మ‌య‌న్మార్ సైన్యంతో సంప్రదింపులు జరుపుతోంది. 

మయన్మార్ వ్యూహం ఎలా ఉందంటే, చైనా నుంచి దూరం కాదు, కానీ భారత్‌తో సంబంధాలు కూడా"
మయన్మార్ సైన్యం కోరుకుంటోంది.  చైనా నుంచి కూడా మ‌య‌న్మార్ బలమైన మద్దతు పొందుతోంది. ఇటు చైనా కూడా త‌న‌దైన‌ ఆర్థిక, సైనిక, రాజకీయ మద్దతు మ‌య‌న్మార్ కి ఇస్తోంది, ఇది భారత్‌కు ఇబ్బందిక‌రంగా మారుతోంది.  ఎందుకంటే చైనా మ‌రింత ముందుకు వ‌స్తే భార‌త్ యాక్ట్ ఈస్ట్ పాల‌సీకి  ఆటంకం క‌లుగుతుంది. 

అందుకే భారత్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం ఇచ్చింది. కానీ, ఈ పర్యటన వివాదానికి కార‌ణ‌మైంది. మయన్మార్‌లోని ప్రజాస్వామ్య మ‌ద్ధ‌తుదారుల‌తో పాటు, పశ్చిమ దేశాలు సైతం భారత్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. బ‌ల‌వంతంగా ఇక్క‌డున్న అధికారాన్ని  సైన్యం త‌మ  చేతుల్లోకి తీసుకున్న మ‌య‌న్మార్ జుంటాకు భార‌త్ మద్దతు ఇస్తోంద‌ని వీరు ఆరోపిస్తున్నారు. కానీ భారత్ తన వైఖరి ఏమిటో స్ప‌ష్టం చేసింది. మా సంప్రదింపులు, అక్క‌డి ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధం కాదని  తేల్చి చెప్పింది. 

మ‌న్మార్ తో దోస్తీ చేయ‌క పోతే.. ఒక గ్యాప్ అంటూ, ఏర్ప‌డుతుంది. ఆ గ్యాప్ లో మ‌న వ్య‌తిరేక శ‌క్తులు ఆ దేశంతో జ‌త క‌ట్ట‌వ‌చ్చు. ఇది భార‌త్ కి హాని  చేస్తుంద‌ని అంటారు మ‌న విదేశాంగ నిపుణులు. 

భారత్-మయన్మార్ సరిహద్దు 1,643 కిలోమీటర్ల పొడవు, ఇది సున్నితమైన, సులభంగా చొరబడగలిగే సరిహద్దు. 2025లో మాలిపురంలో 37 మంది తిరుగుబాటుదారుల మరణాలు, 4 ప్రధాన ఎన్కౌంటర్లు జరిగాయి. KNA-B, PLA, KYKL, UNLF, KCP వంటి మయన్మార్-ఆధారిత గ్రూపులు సరిహద్దు దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

2025 మే 14న, 10 KNA-B మిలిటెంట్లు భారత్‌తో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఇది క్రాస్-బార్డర్ ఆపరేషన్ల అవసరాన్ని ఎత్తి చూపిస్తుంది. క‌లాడ‌న్ ప్రాజెక్టు.. 391 మిలియన్ డాల‌ర్ల‌ వ్యయంతో నిర్మాణం  జ‌రుపుకుంటోంది. క‌ల‌డ‌న్ మ‌ల్టీ మోడ‌ల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ అనే ఈ ప్రాజెక్ట్  భారత్‌కు ఎంతో అవ‌స‌రం. మ‌రెంతో ముఖ్యమైన వ్యూహాత్మకం. ఇది మిజోరాంను సిట్వీ పోర్టుతో అనుసంధానిస్తుంది. కానీ మయన్మార్‌లో అంతర్గత సంఘర్షణ ఈ ప్రాజెక్టును ఆలస్యం చేసింది. 2025 జూలైలో భారత‌ మంత్రి ఈ ప్రాజెక్టును 2027 లో పూర్తి చేయాలన్న టార్గెట్ ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ ట్రిలాట‌ర‌ల్ హైవే కూడా యాక్ట్ ఈస్ట్ పాల‌సీలో కీలకం. ఇరు దేశాలు దీన్ని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నాయి. క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన భూ  వ‌న‌రులు ఇందులో ప్ర‌ధాన  పాత్ర పోషిస్తున్నాయి. వీటి  పై స‌హ‌కారం పెంచుకోడానికి భార‌త్- మ‌య‌న్మార్ స‌మావేశ‌మ‌య్యాయి. లేకుంటే చైనా వీటిపై  క‌న్నేస్తుంది.  

ఇక్క‌డ చైనాతో వ‌చ్చిన ప్ర‌మాదం ఏంటంటే ఈ దేశం  కూడా మ‌య‌న్మార్ సైనిక ప్ర‌భుత్వ జుంటాకు స‌పోర్ట్ చేస్తోంది. ఇది భార‌త్  కి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఎందుకంటే మ‌య‌న్మార్ గానీ పూర్తి  చైనా మాయ‌లో ప‌డితే.. ఇక భార‌త్ యాక్ట్ ఈస్ట్ పాల‌సీ తీవ్ర ప్ర‌భావితం అవుతుంది.

సూటిగా చెప్పాలంటే, మయన్మార్ అధ్యక్షుడి హామీ భారత్‌కు ముఖ్యమైనది, కానీ అది పూర్తిగా నమ్మదగినది కాదు. ఎందుకంటే మయన్మార్ సైన్యం తన భూభాగాన్ని నియంత్రించగలదా? అనే ప్రశ్నకు ఇంకా స‌మాధానం  దొర‌కాల్సి ఉంది.   

అయితే భారత్ వ్యూహం క‌రెక్టే అంటారు నిపుణులు. సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం స‌రైన‌దే అన్న‌ది వీరి భావ‌న‌. కానీ ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా?  తేలాల్సి ఉంది.  మ‌నం ఎప్పుడైతే మ‌య‌న్మార్ చేయి వ‌దిలేస్తామో అప్పుడు చైనా ఆ చేయి అందుకుంటుంది. ఇది  భార‌త్ కి ఎప్ప‌టికీ మంచిది కాద‌న్న అంచ‌నాలున్నాయి. అందుకే భార‌త్ మ‌య‌న్మార్ కి ఈ వ్యూహాత్మ‌క మ‌ద్ధ‌తు ఇస్తోంద‌ని అంటారు ప‌లువురు దౌత్య నిపుణులు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...