Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లా? ఈ 3 తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు!
posted on: Jul 10, 2026 12:59PM

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన ఫండ్ను ఎంచుకోవడమే విజయానికి సంకేతమని చాలామంది భావిస్తుంటారు. గతంలో వచ్చిన రిటర్న్స్, ఫండ్ మేనేజర్ల ట్రాక్ రికార్డ్, ఎక్స్పెన్స్ రేషియో వంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మరీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, వెల్త్ మేనేజ్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఎంచుకునే ఫండ్ కంటే కూడా, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలే మీ దీర్ఘకాలిక లాభాలను దారుణంగా దెబ్బతీస్తాయి. ఒక మోస్తరు లేదా యావరేజ్ ఫండ్ వల్ల ఏడాదికి ఒకటి రెండు శాతం రిటర్న్స్ తగ్గొచ్చేమో కానీ, మార్కెట్ ఒడిదుడుకులను చూసి తప్పుడు సమయాల్లో తీసుకునే నిర్ణయాల వల్ల అసలు కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు ప్రధానంగా చేసే మూడు భారీ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి తప్పు, మార్కెట్లు పడిపోతున్నప్పుడు కంగారుపడి తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోవడం (అమ్మేయడం). మార్కెట్లలో కరెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై, తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తుంటారు. వాస్తవానికి, దీనివల్ల దీర్ఘకాలిక సంపద సృష్టి తీవ్రంగా దెబ్బతింటుంది. మార్కెట్ పతనం కంటే ముందే కాకుండా, మార్కెట్ పూర్తిగా పడిపోయిన తర్వాతే ఎక్కువమంది తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. తమ పోర్ట్ఫోలియో ప్రతి నెలా ఎరుపు రంగులోకి (నష్టాల్లోకి) వెళ్లడం చూడలేక భయంతో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు, 2020లో కరోనా సమయంలో మార్కెట్ భారీగా పతనమైనప్పుడు నిఫ్టీ 50 కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 23 శాతం పడిపోయింది. ఆ సమయంలో స్మాల్-క్యాప్ ఫండ్స్లోకి వచ్చే పెట్టుబడులు (ఇన్ఫ్లోస్) 89 శాతం మేర తగ్గిపోయాయి. కానీ, ఆ తక్కువ వాల్యుయేషన్ల వద్ద కూడా భయపడకుండా ఎవరైతే తమ ఎస్ఐపి (SIP)లను కొనసాగించారో, వారు తర్వాతి రికవరీలో అద్భుతమైన లాభాలను అందుకున్నారు. మార్చి 2020 నుండి డిసెంబర్ 2021 మధ్య కాలంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఏకంగా 105 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
రెండవ తప్పు, ఏదైనా ఒక ఫండ్ లేదా సెక్టార్ భారీగా పెరిగిన తర్వాత, ఆ పరుగును చూసి ఆలస్యంగా అందులో పెట్టుబడులు పెట్టడం. మార్కెట్లో ఒక కేటగిరీ బాగా రాణిస్తూ, చార్ట్ టాప్లో నిలిచినప్పుడు మాత్రమే ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతుంటారు. కానీ, వారు ఇన్వెస్ట్ చేసే సమయానికే ఆ ఫండ్లో రావాల్సిన గరిష్ట లాభాలు వచ్చేసి ఉంటాయి. ఉదాహరణకు, ఏప్రిల్ 2022తో ముగిసిన మూడేళ్ల కాలంలో ఫార్మా మ్యూచువల్ ఫండ్స్ వార్షికంగా 23 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. కానీ సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం కేవలం 17 శాతం లాభాలను మాత్రమే పొందగలిగారు. ఎందుకంటే, మహమ్మారి సమయంలో ర్యాలీ దాదాపు ముగిసిపోతున్న దశలో మెజారిటీ ఇన్వెస్టర్లు అందులోకి ప్రవేశించారు. గోల్డ్ ఈటీఎఫ్లలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. మార్చి 2024 నుండి మార్చి 2026 మధ్య బంగారం ధరలు దాదాపు 117 శాతం పెరిగాయి. అయితే, ఇన్వెస్టర్ల నుండి వచ్చిన మొత్తం పెట్టుబడులలో 75 శాతం వాటా, బంగారం ధర ఇప్పటికే 72 శాతం పెరిగిన తర్వాతే మార్కెట్లోకి వచ్చింది. దీనివల్ల ఆలస్యంగా వచ్చిన ఇన్వెస్టర్లకు చాలా తక్కువ లాభాలు మిగిలాయి.
మూడవ తప్పు, మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు రన్నింగ్లో ఉన్న ఎస్ఐపి (SIP)లను నిలిపివేయడం. మార్కెట్ సైకిల్స్ అన్నింటిలోనూ ఇన్వెస్టర్లలో క్రమశిక్షణను అలరింపజేయడానికే ఎస్ఐపిలను డిజైన్ చేశారు. కానీ మార్కెట్ పడిపోగానే చాలామంది తమ ఎస్ఐపిలను క్యాన్సిల్ లేదా పాజ్ చేస్తుంటారు. ఆర్థిక సంవత్సరాలు 2005 నుండి 2026 మధ్య నిఫ్టీ 50 డేటాను విశ్లేషించగా ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఎస్ఐపి ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే నెగెటివ్ రిటర్న్స్ చూసి కూడా భయపడకుండా, పెట్టుబడులను అలాగే కొనసాగించిన ఇన్వెస్టర్లు... తర్వాతి నాలుగేళ్ల కాలంలో సగటున 12 నుండి 13 శాతం ఎస్ఐఆర్ఆర్ (XIRR) వార్షిక లాభాలను సాధించగలిగారు. అందుకే మార్కెట్ పతనంలో అమ్మేయడం వల్ల పేపర్ మీద ఉన్న తాత్కాలిక నష్టం కాస్తా శాశ్వత నష్టంగా మారిపోతుంది. నిపుణుల సలహా ప్రకారం... మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు కనీసం 7 ఏళ్ల కాలపరిమితిని నిర్దేశించుకోవాలి. మార్కెట్లు పడుతున్నప్పుడు ఎస్ఐపిలను ఆపకపోగా, వీలైతే ప్రతి ఏటా మీ ఎస్ఐపి అమౌంట్ను 10 శాతం మేర పెంచుకుంటూ పోవడం ద్వారా దీర్ఘకాలంలో అపారమైన సంపదను సృష్టించవచ్చు.
how to grow wealth with sip india,costly mutual fund mistakes investors-make.






