మూసీ ఆక్రమణలపై ఉక్కుపాదం.. అక్రమ స్కూల్ భవనం కూల్చివేత

posted on: Jun 22, 2026 2:26PM

 

మూసీ నది పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. హైదరాబాద్ శివారులోని నార్సింగి ప్రాంతంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదన్న సందేశాన్ని ఈ చర్య ద్వారా స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం, "ది బాంబిని క్రీక్" పేరుతో నిర్వహిస్తున్న ఈ పాఠశాల భవనం సుమారు ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా, మూసీ వరద ముంపు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. దీంతో ముందుగా నోటీసులు జారీ చేసిన అధికారులు, అనంతరం భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేత చర్యలు చేపట్టారు.

ఈ పాఠశాలలో ప్రస్తుతం 250 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం. భవనం కూల్చివేతతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లల విద్యాభ్యాసం ఇకపై ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు, మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నది సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారిన నిర్మాణాలను గుర్తించి దశలవారీగా తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలపై ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...