పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులువు కాదు : ఈటల రాజేందర్

posted on: Apr 5, 2026 2:05PM

 

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పంపించి ఐదేళ్లు పూర్తయ్యాయని గుర్తు చేస్తూ, అప్పటి నుంచి తాను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారంటూ పోస్టర్లు వేయడం అవాస్తవమని తెలిపారు.

పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని, పార్టీ మారకూడదనే సందేశం తానే ఇచ్చానన్నారు. తెలంగాణ సమాజానికి తన గురించి పూర్తిగా తెలుసని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తనను బీఆర్‌ఎస్ నుంచి తొలగించడం తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలిపారు. తనను బర్తరఫ్ చేయడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కోళ్ల ఫారాలు కూల్చడం, లీగల్‌గా కొనుకున్న భూములను కూడా సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు. సీఎం‌కు లేఖ రాస్తానని, సరైన సమయం వచ్చినప్పుడు తన స్థానం ఏమిటో తెలుస్తుందని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తోందని, ప్రజలను దబాయిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారని, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని చెప్పారు. మొదటి కార్యక్రమంగా బాలాజీ నగర్‌లో “చలో” కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికల కోసం సర్వేలు చేస్తున్నామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని, వ్యక్తిగత అభిమానం ఆధారంగా నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. 

తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించి మంత్రిపదవి ఆఫర్ చేశారని వెల్లడించారు. అలాగే మంత్రులు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, జి. వివేక్ వెంకటస్వామి వంటి నేతలతో కలిసి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి లేదా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండేదని అన్నారు. కానీ పదవుల కోసం రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. అబద్ధాల పునాదులపై రేవంత్ రెడ్డి గెలిచారని, అదే విధంగా పాలన కొనసాగుతోందని విమర్శించారు.

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తుచేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానన్నారు. గత ప్రభుత్వంలో దోచుకున్నది కక్కిస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఈటల ప్రశ్నించారు. చివరగా ప్రజల్ని, ధర్మాన్ని నమ్ముకున్నానని, సోషల్ మీడియాను కాదు అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...