Latest News

పెళ్లి రద్దుతో మనస్తాపం.. తల్లీ కుమార్తె బలవన్మరణం

posted on: Mar 14, 2026 12:25PM

వివాహ నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి రద్దు కావడంతో మనస్తాపానికి గురై పెళ్లికూతురు, ఆమె తల్లి విషం తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో జరిగింది.  వివరాలిలా ఉన్నాయి.  ద్రోణాదుల గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కుమార్తెకు పెళ్లి సంబంధం చూసిన పెద్దలు మార్టూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం నిశ్చయించారు. గత ఏడాది డిసెంబర్ 14న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వివాహం జరపాలని నిర్ణయించారు.

అయితే ఇటీవల వరుడు శేషుబాబు దివ్యతో పాటు ఆమె తల్లిదండ్రులను  మార్టూరులోని తన ఇంటికి పిలిచి.. తాను హైదరాబాద్‌లో దివ్యను గమనిస్తూ రహస్యంగా తీసినట్లు చెప్పిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపిస్తూ పెళ్లి చేసుకోలేనని  తెలిపాడు.  దీంతో తీవ్రంగా కలత చెందిన దివ్య, ఆమె తల్లి సుజాత మార్టూరులోనే ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేసి తమ గ్రామానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన శ్రీనివాసరావు వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి  గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాదాపు వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆ ఇద్దరి పరిస్థితి విషమించడంతో గురువారం (మార్చి 12) దివ్య, ఆమె తల్లి సుజాత మరణించారు.  ఒకేసారి తల్లి–కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...