ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ హతం
posted on: Mar 17, 2026 10:04PM

ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లారిజానీని లక్ష్యంగా చేసుకుని సోమవారం రాత్రి దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రకటించారు. అలాగే టెహ్రాన్పై జరిగిన ఇతర దాడుల్లో ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలిటరీ ఫోర్స్ కమాండర్ గోలెమ్ రెజా సోలేమాని కూడా హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘటనలను ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం తదితర వ్యవహారాల్లో లారిజానీ కీలక పాత్ర పోషించారు. అలాగే ఇటీవల హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజంగా కూడా వ్యవహరించారు.
అలీ ఖమేనీ మరణం తర్వాత లారిజానీని ఇరాన్లో శక్తివంతమైన నేతగా చాలా మంది భావించారు. అలాగే ఇరాన్ 'సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రివల్యూషన్'లో కూడా లారిజానీ సభ్యుడిగా ఉన్నారు. అలాంటి కీలక నేత హతమవడం నిజమే అయితే అది ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. ఇక, గోలెమ్ రెజా సోలేమాని నేతృత్వంలోని బసిజ్ దళాలు ఇరాన్లోని ప్రజా ఉద్యమాలను హింసాత్మకంగా అణిచివేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై అమెరికా, ఈయూ కూడా ఆంక్షలు విధించాయి. తాజాగా సోలేమానితో పాటు బసిజ్ డిప్యూటీ కమాండర్, ఇతర ఉన్నతాధికారులు టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో దాక్కుని ఉండగా దాడి చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దాడిలో అందరూ మరణించారని పేర్కొంది. అలాగే ఈ దాడుల్లో పాలస్తీనా ఇస్లామిక్ నేత అక్రమ్ అల్-అజౌరీ కూడా మరణించి ఉండవచ్చని పేర్కొంది.


.webp)


