మొయినాబాద్ డ్రగ్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

posted on: Mar 16, 2026 3:45PM

 

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పరిధిలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో డ్రగ్స్ వినియోగంతో పాటు కాల్పుల ఘటన కూడా చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఫామ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం మరియు డ్రగ్స్‌తో పార్టీ నిర్వహించారు. పోలీసులు ఫామ్ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే బుల్లెట్ శబ్దం వినిపించడంతో ఈగల్ టీం, టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

పోలీసులు “మేము పోలీసులం, కాల్పులు చేయవద్దు” అని గట్టిగా హెచ్చరించినప్పటికీ మరో రెండు సార్లు కాల్పుల శబ్దం వినిపించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంతలో “మీరు కాల్చండి… ఏం జరిగినా నేను చూసుకుంటాను, బాధ్యత నాదే” అంటూ ఎవరో గట్టిగా అరచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు మరింత గట్టిగా హెచ్చరించడంతో కాల్పులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అనంతరం పోలీసులు స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకుని ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. సెర్చ్ వారెంట్‌ను ఫామ్ హౌస్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డికి అందజేశారు. బాత్రూం దగ్గర నమిత్ శర్మ చేతిలో ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. 

మరో వ్యక్తి వద్ద బుల్లెట్ షెల్స్ ఉండటంతో అతడినీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఒక మహిళతో పాటు మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జర్మన్ మేడ్ పాయింట్ .32 రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని విడివిడిగా విచారించగా మొదట ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పదేపదే విచారణ జరపడంతో చివరకు సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రెండు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

కొకైన్ ఎవరూ తెచ్చారన్న ప్రశ్నకు మొదట ఎవరూ సమాధానం ఇవ్వకపోయినా, పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్‌ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కొందరికి డబ్బు ఇచ్చి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు. చివరకు కౌశిక్ రవి తానే కొకైన్ తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. సిమ్లాకు బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఒక్కో గ్రాముకు రూ.15 వేల చెల్లించి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడించాడు.

పార్టీలో ఉన్న 11 మందికి డ్రగ్ లైవ్ కిట్‌తో పరీక్షలు నిర్వహించగా అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డిలకు డ్రగ్ పాజిటివ్‌గా వచ్చింది. కాల్పులు జరిపిన నమిత్ శర్మ వద్ద ఉన్న రివాల్వర్ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ తుపాకి అసలు నితీష్ రెడ్డి వద్ద ఉండాల్సి ఉండగా నమిత్ శర్మ వద్దకు ఎలా వచ్చిందన్నదానిపై కూడా విచారణ కొనసాగుతోంది. పోలీసులు ఫామ్ హౌస్‌లోకి వస్తున్నప్పుడు వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ విచారణలో వెల్లడించాడు. 

కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని కూడా ప్లాన్ చేసినట్లు చెప్పాడు. అవసరమైతే పోలీసులకు గాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపినట్లు కూడా వెల్లడించాడు. పార్టీలో ఉన్నవారు మద్యం‌తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు చివరకు ఒప్పుకున్నారు. రెండోసారి నిర్ధారణ కోసం అందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించారు. రెండో పరీక్షల్లో ఎంపీ పుత్త మహేష్ కుమార్‌కు కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వెల్లడించింది. 

నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడింది. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరు మద్యం‌లో కొకైన్ కలిపి తీసుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది. పోలీసుల ప్రకారం, వీకెండ్ డ్రగ్ పార్టీని పైలట్ రోహిత్ రెడ్డి ముందుగానే ఏర్పాటు చేసి స్నేహితులకు ఆహ్వానం పంపాడు. అతని ఆహ్వానం మేరకు పలువురు అక్కడికి చేరుకుని పార్టీ నిర్వహించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...