Latest News

బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి రంజాన్ ప్రార్థనలు..కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ

posted on: Mar 21, 2026 12:41PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసినట్లే.  గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి నేడు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు.

 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే తన నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి, కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా తను కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నట్లు చాటారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

పార్టీ మారతానని ప్రకటించిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు.  మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబులు జగిత్యాల వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.  పార్టీ మారే ఆలోచన వీడాలని సూచించారు. సమస్య ఏదైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామనీ వారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమచారం.

అయితే ఈ రాయబారంపై జీవన్ రెడ్డి ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.  ఇంతకు ముందే జీవన్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్లో నటరాజ్ భేటీ అయ్యారనీ, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామనీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో తన వైఖరిని మార్చుకుంటారా.. లేక గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?  

google-ad-img
    Related Sigment News
    • Loading...