నన్ను ప్రశ్నించండి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమం

posted on: May 26, 2026 2:13PM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.   ప్రజాప్రతినిధి అంటే కేవలం ఓట్లు వేయించుకుని ఐదేళ్లపాటు కనిపించకుండా పోవడం కాదనీ..  ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కలిగిన సేవకుడని నిరూపిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త జవాబుదారీతనానికి నాంది పలుకుతూ ఆయన  నన్ను ప్రశ్నించండి అనే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికీ, ముఖ్యంగా యువతకు తమ నాయకుడిని నేరుగా నిలదీసే హక్కును కల్పించారు. ప్రజాప్రతినిధికి   ఓటేసి గెలిపించిన ప్రజలకు తమ సమస్యలపై, నియోజకవర్గ ప్రగతిపై ప్రశ్నించే పూర్తి హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా  ప్రకటించారు.  ఈ వినూత్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతరంలో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  

తన నియోజకవర్గంలో  ప్రారంభమైన ఈ చైతన్యం కేవలం నెల్లూరుకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా,  దేశవ్యాప్తంగా ఒక బలమైన ఆలోచనగా మారాలని  ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలంటే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలే కీలకమని, నాయకులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు.  ఇదే సమయంలో నియోజకవర్గంలోని పలు కీలక రాజకీయ, పాలనా పరమైన అంశాలపై కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వార్డుల  డీలిమిటేషన్ ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరిగాయని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియపై కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ విషయంలో తాను ఏ రోజూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియ  నిబంధనల ప్రకారం సాగేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛ  ఇచ్చామని  వెల్లడించారు.  మరోవైపు, రాబోయే ఎన్నికలు,  రాజకీయ భవిష్యత్తుపై నెల్లూరు రూరల్ రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని పూర్తిగా పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.  ఒకవేళ అధిష్ఠానం తమకు కాకుండా మరొకరికి ఈ సీటు కేటాయించాలని నిర్ణయిస్తే, తాము కచ్చితంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని మరియు పార్టీ విజయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా హుందాగా ప్రకటించి అందరినీ విశ్మయపరిచారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...