స్కూల్ టాపర్లకు మంత్రి కోమటిరెడ్డి గిఫ్ట్ ఏంటో తెలుసా?

posted on: May 23, 2026 11:02AM

గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో చదివే పిల్లలు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి  మనమూ ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కుతామా?  అని కలలు కంటారు.  రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...ఆ  చిన్నారుల కలను నిజం చేసి చూపారు.  వివరాలిలా ఉన్నాయి.  నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కొద్ది నెలల క్రితం తిప్పర్తి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సమయంలో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి.. బాగా చదివి టాప్ మార్కులు సాధిస్తే మీకు నేను సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని అమలు చేశారు.  శుక్రవారం (మే 22) హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించిన మంత్రి, వారికి అభినందనలు తెలిపారు. ఒక్కో విద్యార్థితో మాట్లాడి వారి కలలు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాల గురించి తెలుసుకున్నారు. చదువుతోనే జీవితాన్ని మార్చుకోవచ్చని, పేదరికాన్ని జయించే శక్తి విద్య లోనే ఉందని వారికి ప్రేరణనిచ్చారు. మీరు కేవలం ఉద్యోగాల కోసం చదవొద్దు… రేపు మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి  అంటూ మంత్రి విద్యార్థు లకు కొత్త దిశగా ఆలోచించేలా సూచించారు  స్టార్ట్‌అప్స్, కొత్త ఆవిష్కర ణలు, ఉన్నత విద్య గురించి వారికి వివరించారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు. మీలాంటి పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలి. మీ చదువులకు నేను అండగా ఉంటా  అని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోం దని మంత్రి పేర్కొన్నారు. విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ప్రతి నియోజకవర్గంలో ఆధునిక రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్మిస్తు న్నామని తెలిపారు..  టెన్త్ పరీక్షల్లో టాపర్స్ గా నిలిచిన 14 మంది విద్యార్థులు.. శనివారం (మే 23) ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి  విశాఖపట్నంకు బయలుదేరారు. అక్కడ బీచ్ సందర్శనతో పాటు అరకు వ్యాలీ టూర్, త్రి స్టార్ హోటల్‌లో బస వంటి ప్రత్యేక ఏర్పాట్లు వారి కోసం మంత్రి కోమటిరెడ్డి చేశారు. ఈ  విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు, మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు. 
 
కాగా అంతకు ముందు అంటే శుక్రవారం (మే 22) ఫ్లైట్ టికెట్లు అందుకున్న విద్యార్థులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంత వరకూ తాము ఆకాశంలో విమానం చూస్తూ ఎప్పుడైనా ఎక్కుతామా అని అనుకునేవాళ్లమనీ,  ఇప్పుడు నిజంగానే ఫ్లైట్ ఎక్కబోతున్నామనీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమ జీవితాల్లో  ఎప్పటికీ మర్చిపోలేని రోజంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  విద్యార్థుల ఆనందాన్ని ముచ్చటగా వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి,  ఫ్లైట్ ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేయండి..  పెద్ద కలలు కనండి..  ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగండి..  మీ అందరికీ నా ఆశీస్సులు  అంటూ   శుభాకాంక్షలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...